నంద్యాల, ఆగస్ట్ 29: నంద్యాల ఉపఎన్నికల ప్రచార పర్వంలో తనదైన రీతిలో హోరెత్తిస్తూ ప్రచారాన్ని సాగించి, అభివృద్ధి చేయలేదని అధికార పార్టీని విమర్శించడమే ప్రధాన ఎజెండాగా మలచుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఫలితాల అనంతరం ఆమె మాట ఎక్కడ వినిపించలేదు. దీంతో 'రోజా ఏమయింది? నంద్యాలలో టీడీపీ గెలుపు తర్వాత కనిపించకుండా పోయింది' అంటూ నెటిజన్లు పలు విధాలుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఈ విషయం తెలిసిన రోజా తన సోషల్ మీడియా ఖాతాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ''నాన్న ఆశయాలే శ్వాసగా బతికావు. నాన్నపై కుట్రలను సహించక దేశాన్ని శాసించే నియంత మెడలు వంచి, నమ్ముకున్న మా కోసం దమ్మున్న నాయకుడిగా నాన్న పేరుతో పార్టీ పెట్టావు. దొంగ హామీలు ఇవ్వలేదు. కుల రాజకీయాలు చేయలేదు. వేరొకరి ప్రభతో వెలగాలనుకోలేదు. సింహంలా సింగిల్గా నిలిచావు. ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు. జగనన్నా, నీ వెంటే మేముంటాము. ఈ పోరాటంలో మేము సైనికులమవుతాము!'' అంటూ ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. ''గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా... ఆఖరి శ్వాస వరకూ 'జై జగన్' అంటూనే ఉంటా!'' అని రోజా ఘంటాపథంగా తెలిపారు.