వాషింగ్టన్: అమెరికా హెచ్ 1-బీ వీసాల స్క్రూటిల జోరు పెంచింది. అమెరికా 2019 ఆర్ధిక సంవత్సరానికి గాను (2018 అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు) మొదటి ఆరు నెలల కాలానికి హెచ్-1 బీ వీసాల స్క్రూటినీ కొనసాగిందని అమెరికన్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా రిలీజ్ చేసిన డేటాలో ప్రకటించింది. 2019 ఆర్ధిక సంవత్సరం..మార్చి 31 వరకు 95 వేలకు పైగా అప్లికేషన్లను పరిశీలించారు. గత ఏడాది మార్చి 31 నాటికి 88 వేలకు పైగా దరఖాస్తులు పరిశీలనకు నోచుకున్నాయి. ఈ సారి సుమారు 60 శాతం వరకు హెచ్-1 బీ వీసాలను భారతీయులకు జారీ చేశారు.ఇతర దేశాలతో పోలిస్తే ఈ విషయంలో ఇండియాయే ముందుంది. అటు-స్పాన్సరింగ్ కంపెనీల నుంచి అదనపు సమాచారాన్ని సేకరించిన అనంతరం ఈ దరఖాస్తుల అప్రూవల్ రేటు తొలి ఆరు నెలల్లో 60.5 శాతం తిరస్కరణకు గురైందని, అంటే 95 వేలకు పైగా అప్లికేషన్లను అప్రూవ్ చేయాల్సి ఉండగా.. కేవలం 57 వేలకు పైగా దరఖాస్తులను ఆమోదించారని ఈ డేటా పేర్కొంది. దీన్ని బట్టి ఈ వీసాల జారీలో ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలను పాటించిందని అంటున్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను గతంలో కన్నా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేయడంతో వీసాల జారీ కొంతవరకు తగ్గిందన్నది వాస్తవం. అభ్యర్థి తన గత అయిదేళ్ల సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా పొందుపరచాలని ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.