ఇస్లామాబాద్: బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనేజషన్ సమావేశాల సందర్భంగా భారత్ కు ముందు నుండే లేఖలు పంపిస్తున్నామని కాని వీటికి భారత్ ఎలాంటి జవాబు ఇవ్వలేదని విదేశాంగ మంత్రి ఖురేషి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్తో సత్సంబంధాలు నెరిపేందుకు చర్చలకు రావాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్, విదేశాంగ మంత్రి ఖురేషి వేర్వేరుగా లేఖలు రాశారు. ఐతే వీటిపై భారత్ స్పందించలేదు. దీంతో ఖురేషి విమర్శలకు దిగారు. భారత ప్రధాని మోది ఎస్సిఓ సదస్సుకు వెళ్లడానికి పాక్ ఎయిర్స్పేస్ను అడిగినప్పుడు తాము అందుకు అంగీకరించామని, కాని మోది పాక్ ఎయిర్ స్పేస్ నుంచి కాకుండా వేరే మార్గంలో వెళ్లారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా భారత్ నుంచి సమాధానం లేదు. తాము పొరుగుదేశాలతో పారదర్శకంగా మెలగాలనే ఉద్దేశ్యంతోనే చర్చలకు ఆహ్వానించామని, కాని భారత్ ఇలా చేస్తే, వారితో మైత్రి కోసం వెంపర్లాడేది లేదని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిష్కెక్లో జరుగుతున్న ఎస్సిఓ సదస్సులో పాక్ తీరును మోది ఎండగడుతూ, పాక్ ఇకనైనా ఉగ్రవాద రహిత దేశంగా మెలిగితే కనీసం కొందరైనా మైత్రి కొనసాగిస్తారని లేకపోతే దాయాది దేశం ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందని హితవు పలికారు.