అమెరికాలోని సౌత్ కెరోలినాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్న పిల్లల్ని కడతేర్చిన తండ్రికి అతని భార్య క్షమాభిక్ష ప్రసాదించాలంటూ కోర్టును కోరింది. ఆ కర్కోటక భర్తపై భార్య మనసు మారిందేమో కానీ కోర్టు మాత్రం చలించలేదు. గురువారం అతని మరణశిక్ష విధించింది. పూర్తి వివరాల ప్రకారం....2012లో అంబర్ కైజర్ భర్త టిమోతీ జోన్స్ జూనియర్ నుంచి విడాకులు పొందింది. కోర్టు మేరా(8), ఎలియాస్(7), నాథన్(6), గాబ్రియెల్(2), అబిగెల్(1)ల సంరక్షణ బాధ్యతను టిమోతీకే ఇచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత అతను వాళ్లందరిని చేజేతులారా చంపాడు. వాళ్ల మృతదేహాలను చెత్త బ్యాగుల్లో పెట్టి ఆ సంచులను అలబామాలోని ఒక మురికి రోడ్డుపై వదిలేశాడు.మేలో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. తనకు మతిస్థిమితం సరిగా లేనందువల్ల అలా చేశానని, తనకు శిక్ష విధించవద్దని జోన్స్ కోర్టును కోరాడు. అతనే ఈ నేరం చేశాడని ఈ నెల ఆరంభంలో నిర్ధారణ అయింది. అయితే తన మాదిరిగా మాజీ భర్త కుటుంబం కొడుకు లేని బాధ పడరాదని భావించిన కైజర్ అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలని జ్యూరీని కోరింది.జోన్స్ చేతుల్లో తను పడ్డ బాధలను ఆమె ఏకరువు పెట్టింది. పిల్లల ముందు తనను కొట్టేవాడని, తిట్టేవాడని చెప్పింది. తన మొహంపై ఉమ్మేసి, తలను గోడకేసి కొట్టి, కత్తితో ముక్కలుగా కోస్తానని బెదిరించేవాడని తెలిపింది. జోన్స్ నానమ్మ, తండ్రి కూడా తమ బిడ్డకు మరణశిక్ష విధించవద్దని కోరారు. కానీ వీళ్ల వేడుకోళ్లకు కరగని కోర్టు నవంబర్ 30న అతనికి విషపు ఇంజెక్షన్ లేదా ఎలక్ట్రిక్ ఛెయిర్ తో మరణశిక్ష అమలు చేయాలని తీర్పు ఇచ్చింది.