వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు. ఫలాల్లో రాజు అయిన ఈ పండు వేసవిలోనే విరివిగా లభిస్తుంది. పుల్లటి కాయలను ఊరగాయలు పెట్టుకుంటారు. తియ్యటి పళ్లను పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఉత్తరప్రదేశ్ మలీహాబాద్ కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినా కలీముల్లా అనే మామిడి రైతు అనేక రకాల హైబ్రిడ్ మామిడి పండ్లను తయారు చేశారు. పాతరకాలను సంకరం చేసి కొత్త రకాల మామిడిపండ్లను అందించడంలో ఈ రైతుది అందెవేసిన చేయి.
ఆయన గతంలో రూపొందించిన ఓ మామిడిచెట్టుకు 300 రకాల కాయలు కాయడం ఓ అద్భుతంగా చెప్పుకుంటారు. తాజాగా, ఆయన ఎంతో రుచికరమైన మరో కొత్త రకం మామిడిఫలానికి రూపకల్పన చేశారు. అయితే, దానికి 'అమిత్ షా' అని పేరు పెట్టారు. ఆ మామిడి పండుకు బీజేపీ చీఫ్ పేరుపెట్టడానికి కలీముల్లా చెప్పిన కారణమేంటో చూడండి! "ఈ మామిడి పండు మంచి రుచితో పాటు తగిన బరువు కూడా ఉంటుంది. త్వరలోనే షా మామిడి పండ్లను మార్కెట్లోకి తీసుకువస్తాం. కలిముల్లా విభిన్న రకాల మామిడి వంగడాలను పండిస్తూ గుర్తింపు పొందారు. 2015లో ఓ అరుదైన మామిడి పండుకు ఆయన ప్రధాని మోదీ పేరు పెట్టారు.