2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. యువీ వీడ్కోలు సందర్భంగా అటు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం అతడి గత రికార్డులను గుర్తు చేస్తూ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో , యువీకి అభిమాని అయిన బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ ఫేస్బుక్ వేదికగా అభినందనలు తెలిపాడు. "థ్యాంక్యూ పాజీ.. నేను చూసిన వారిలో నువ్వొక గొప్ప ఎడమచేతివాటం బ్యాట్స్మెన్వి. నేనెప్పుడు నీ స్టైల్, బ్యాటింగ్ టెక్నిక్ను అనుసరించాలని ప్రయత్నిస్తుంటాను. నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నీ కొత్త ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను" అని శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే, సౌమ్య సర్కార్ తన పోస్టులో రాసిన వ్యాఖ్యలు అచ్చం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ను చేసిన ట్వీట్ మాదిరి ఉన్నాయి. కాగా, యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే శిఖర్ ధావన్ ట్వీట్ చేయగా... సౌమ్య సర్కార్ మాత్రం ఆ తర్వాతి రోజు ఫేస్బుక్లో అవే వ్యాఖ్యలు పోస్టు చేశాడు. దీంతో ధావన్ ట్వీట్ను సౌమ్య సర్కార్ కాపీ కొట్టాడని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.