చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ మరోసారి చిత్తు చేసింది. ప్రపంచ కప్లో టీమిండియా చేతిలో పాక్ మరోసారి చిత్తయింది. దీంతో ప్రపంచ కప్లో పాకిస్తాన్ను భారత్ వరుసగా ఎడవసారి ఓడించింది. ఆదివారం మాంచెస్టర్లో జరిగిన వరల్డ్కప్ మ్యాచ్లో భారత్ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగుల చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(140), రాహుల్(57)లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. తరువాత బరిలోకి దిగిన కోహ్లి(77) అర్ధసెంచరీతో స్కోర్ని పరుగులు పెట్టించాడు. హార్దిక్ పాండ్య(26), ధోని(1) విజయ్ శంకర్(15), కేదార్ జాదవ్(9) ఆశించినంత మేరకు రాణించలేదు. పాక్ బౌలర్లలో అమీర్ మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీశారు.
337 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్.. ఆరంభంలోనే ఓపెనర్ ఇమామ్ ఉల్(7) వికెట్ను కోల్పోయింది. తరువాత వచ్చిన బాబర్ అజామ్(48) తోకలిసి నిలకడగా ఆడిన మరో ఓపెనర్ ఫకార్ జమాన్(62) రెండో వికెట్కి 104 పరుగులు జోడించారు. ఈ జోడీని కుల్దీప్ పెవిలియన్కు పంపడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 27వ ఓవర్లో వరుస బంతుల్లో హఫీజ్(9), షోయబ్(0)లను అవుట్ చేయడంతో పాక్ 12 పరుగులు తేడాలో 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(12)ను విజయ్ శంకర్ క్లీన్ బౌల్డ్ చేయవడంతో పాక్ ఓటమికి మరింత చేరువయింది. ఈ దశలో వర్షం పడడంతో మ్యాచ్ను 40 ఓవర్లకి కుదించి టార్గెట్ని 302 పరుగులుగా నిర్దేశించారు. చివర్లో ఇమాద్ వసీమ్ (46) నాటౌట్ చెలరేగినా పాక్కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో కుల్దీప్, విజయశంకర్, పాండ్య చెరో 2 వికెట్లు తీశారు.