అత్త వేధింపులు తట్టుకోలేక ఓ కోడలు రోకలి బండతో కొట్టి చంపేసింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. తనకు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అత్త వేధింపులు గురిచేసిందని.. తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడినట్లు కోడలు అంగీకరించడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే... పాల్వంచకు చెందిన మైల కనకతార(53)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కొడుకులతో కలిసి ఉంటోంది. కాగా... రెండేళ్ల క్రితం కనకతార చిన్న కొడుకు చైతన్య అనే యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఇది నచ్చని కనకతార కోడలిని నానా రకాలుగా వేధించేది.
ఇటీవల చైతన్యకు ఆడపిల్ల ఉంటుంది. ఆడపిల్లని కన్నావు అంటూ అత్త మరింత ఎక్కువగా వేధించడం మొదలుపెట్టింది. దీంతో ఆ వేధింపులను చైతన్య తట్టుకోలేకపోయింది. ఆవేశంలో రోకలిబండ తీసుకొని తన అత్త తలపై బలంగా కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తానే హత్య చేసినట్లు చైతన్య అంగీకరించడంతో.. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.