మొన్నటికి మొన్న ఓ జంట తమ పైశాచిక ఆనందం కోసం సింహాని వేటాడి దాని కళేబరం పక్కనే ముద్దు పెట్టుకుంటూ ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. స్పెయిన్కు చెందిన ఓ జంట కూడా తమ వివాహాన్ని వెరైటీగా ప్లాన్ చేసింది. కాడిజ్ పట్టణంలో బీచ్ తీరాన సఫారీ థీమ్తో పెళ్లి వేడుక చేసుకుంది. అయితే వారు చేసిన వినూత్న ప్రయత్నంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. వారు థీమ్ వెడ్డింగ్లో భాగంగా అతిథులను ఆకట్టుకునేందుకు పెళ్లివారు వేడుక ప్రాంగణంలో రెండు జీబ్రాలను ఏర్పాటు చేశారు. అయితే అవి నిజంగా జీబ్రాలు కావు. గాడిదలను కట్టేసి..వాటిని హింసిస్తూ పెయింట్ వేసి జీబ్రాలుగా చిత్రీకరించారు. ఈ క్రమంలో వెరైటీ వెడ్డింగ్ గురించి ప్రస్తావిస్తూ ఏంజెల్ థామస్ అనే వ్యక్తి.. 'తమ స్వార్థం కోసం జంతువులను ఇలా హింసిస్తారా' అంటూ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్గా మారడంతో సదరు జంటపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు అసలు మనుషులేనా.. నిజంగా ఇది సిగ్గు చేటు. మూగ జీవాలను ఇంతలా వేధిస్తారా' అంటూ మండిపడుతున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన స్పెయిన్ పర్యావరణ శాఖ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.