పాకిస్థాన్‌పై దాడి చేసిన పైలట్లకు సముచిత గౌరవం

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 07:52 PM

పాకిస్థాన్‌పై దాడి చేసిన పైలట్లకు సముచిత గౌరవం

చిరకాల ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ లోని బాలాకోట్‌ ఉగ్రవాద స్థావరాలపై ఫిబ్రవరి 26న జరిపిన దాడిలో పాల్గొన్న వైమానిక దళ పైలట్లకు కేంద్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఈ క్రమంలో ఎయిర్ స్ట్రైక్స్‌లో పాల్గొన్న ఐదుగురు ఐఏఎఫ్ పైలట్లకు వాయుసేన పురస్కారాలు ప్రకటించారు. అయితే వీరిలో హైదరాబాద్‌కు చెందిన బి కార్తీక్ నారాయణ్ రెడ్డి కూడా ఉండటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. కార్తీక్ నారాయణ్ రెడ్డి ఐఏఎఫ్‌లో స్క్వాడ్రన్ లీడర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కార్తీక్‌తో పాటు వింగ్ కమాండర్ అమిత్ రంజన్, స్క్వాడ్రన్ లీడర్లు రాహుల్ బసోయా, పంకజ్ భుజాడే, శశాంక్ సింగ్‌కు కూడా ప్రతిష్టాత్మక వాయుసేనా పతకాలు (గ్యాలంట్రీ) ఎంపికయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ ఐదుగురు అధికారులు గత ఫిబ్రవరి 26న బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై మిరాజ్-2000 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఐఏఎఫ్ ఈ మెరుపు దాడులు చేపట్టింది. ఐఏఎఫ్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారి కూడా ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్‌కు యుద్ధ సేవా అవార్డు ప్రకటించారు. ఫైటర్‌ కంట్రోలర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన మింటీ అగర్వాల్.. భారత భూభాగం పైకి దూసుకొచ్చిన పాక్ యుద్ధ విమానాలను తరిమి కొట్టడంలో ముఖ్య భూమిక పోషించారు. బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడుల అనంతర ఘటనలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ (36)ను ప్రభుత్వం ‘వీర్‌ చక్ర’ పతకానికి ఎంపిక చేసింది. ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారాల్లో వీర్‌ చక్రది మూడో స్థానం కావడం గమనార్హం. పాక్ యుద్ధ విమానాలను తరిమికొడుతూ ప్రమాదశశాత్తూ పీవోకే భూభాగంలో పడిపోయిన అభినందన్.. ఆ తర్వాత నాటకీయ పరిణామాల అనంతరం సగర్వంగా భారత గడ్డకు తిరిగొచ్చిన విషయం తెలిసిందే.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు మొత్తం 13 పతకాలు దక్కాయి. వీటిలో 5 యుద్ధ సేవా, 7 వాయుసేన పతకాలు ఉన్నాయి. శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత సేవా పతకాల్లో రెండోదైన ‘కీర్తి చక్ర’.. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సప్పేర్‌ ప్రకాశ్‌ జాదవ్‌ను మరణాంతరం వరించింది. ఇక సైన్యానికి 8 శౌర్య చక్ర పతకాలు, 98 సేనా పతకాలు లభించగా.. నేవీకి ఒక శౌర్య చక్ర పతకం వచ్చింది. జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదం, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో తీవ్రవాదంపై పోరాడిన కేంద్ర భద్రతా దళాల యోధులకు అత్యధిక సంఖ్యలో శౌర్య పతకాలు లభించాయి. సీఆర్పీఎఫ్‌ సిబ్బందిలో ఒకరికి కీర్తి చక్ర, ఇద్దరికి శౌర్య చక్ర పతకాలు లభించాయి.

సెప్టెంబరులో జమ్మూలో ముగ్గురు కరడుగట్టిన జైష్‌-ఎ-మొహమ్మద్‌ ఉగ్రవాదులను కడతేర్చిన హర్పాల్‌ సింగ్‌కు కీర్తి చక్ర లభించింది. ఆయనతో పాటు కలిసి పోరాడిన కానిస్టేబుల్‌ జకీర్‌ హుస్సేన్‌కు శౌర్య చక్ర ప్రకటించారు. బారాముల్లాలో ఇద్దరు జైష్‌ ఉగ్రవాదులను చంపిన కానిస్టేబుల్‌ సబ్లే ద్యానేశ్వర్‌ శ్రీరామ్‌ కూడా శౌర్య చక్రకు ఎంపికయ్యారు.





Untitled Document
Advertisements