పొలాల్లో ల్యాండ్ అయిన విమానం...తప్పిన పెను ప్రమాదం

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 08:14 PM

పొలాల్లో ల్యాండ్ అయిన విమానం...తప్పిన పెను ప్రమాదం

రష్యాలో ఓ విమానం పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. మాస్కోలోని ఝుకోవస్కే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన ఎయిర్‌బస్-321 కొద్ది క్షణాల్లోనే ఎడమ వైపు ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే కుడి వైపు ఇంజిన్‌ను మరో పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. ఇంజిన్లు పనిచేయకపోవడం వల్ల విమానం తిరిగి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పైలట్ చాకచక్యంతో సమీపంలోని పొలాల్లోకి దింపేశాడు. ఇంజిన్లు ఆగిన తర్వాత కూడా విమానం వేగంగా ముందుకు కదిలింది. ఆ వేగంతోనే పైలట్ విమానాన్ని ఎంతో నేర్పుగా పొలాల్లోకి ల్యాండ్ చేశాడు. లేకపోతే.. ఆ విమానం కిందపడి ముక్కలయ్యేది. ఆ విమానంలోని 226 ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు పోయేవి. ఈ ఘటనపై ఓ ప్రయాణికుడు స్పందిస్తూ.. ‘‘ల్యాండింగ్‌కు ముందు విమానం రెండు వైపుల నుంచి మంటలు కనిపించాయి. తీవ్రమైన పొగ, కాలుతున్న వాసన వచ్చింది. విమానంలో ఒక్కసారే భారీ కుదుపులు ఏర్పడ్డాయి. వేగంగా కిందపడిపోతున్నట్లు అనిపించింది. సెకన్ల వ్యవధిలోనే విమానం పొలాల్లోకి దిగిపోయింది’’ అని తెలిపాడు. ఈ ఘటనలో 23 మంది ప్రయానికులకు గాయాలయ్యాయి. పలువురికి ఎముకలు విరిగాయి. విమానాశ్రయానికి ఒక మైలు దూరంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. 1993 నవంబర్ 15న మద్రాస్ విమానాశ్రయం నుంచి 272 మంది ప్రయాణికులతో ఓ విమానం బయల్దేరింది. అందులో చిరంజీవి, బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు, విజయశాంతి, అల్లు రామలింగయ్య దంపతులు, మాలాశ్రీ, హాస్య నటుడు సుధాకర్, దర్శకులు బాపు, కోడిరామకృష్ణ, రచయితలు పరుచూరి వెంకటేశ్వరావు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగా.. విమాన రెక్కల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఇంధనం కూడా తక్కువగా ఉండటంతో నెల్లూరు జిల్లా వేంకటగిరికి 27 కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.





Untitled Document
Advertisements