కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే కారణం అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల మృతిపై దుష్ప్రచారం చేయడం సబబు కాదని, రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
టీడీపీ హయాంలో కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన్ని స్పీకర్ చేశారన్న కొడాలి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, స్పీకర్ పదవి ఇవ్వడం అవమానించడమా? అలా అయితే, తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి ఇచ్చిన వైసీపీ కూడా ఆయన్ని అవమానించిందా? అని ప్రశ్నించారు. స్పీకర్ పదవి ఎంతో ఔన్నత్యమైంది అని అన్నారు. అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకెళ్లి వాడుకున్నట్టు తనపై పెట్టిన కేసుతో కోడెల కుంగిపోయారని అన్నారు. వైసీపీ మానసిక వేధింపుల వల్లే కోడెల చనిపోయారని ఆరోపించారు.