రిలయన్స్ జియో 2016లో మార్కెట్లోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. కొందరు నేరుగా జియో కనెక్షన్ కొనుగోలు చేస్తే మరి కొందరు వేరే నెట్వర్క్ల నుంచి జియోలోకి మారారు. మొత్తానికి ఇండియాలోనే అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ వ్యవస్థగా అవతరించింది.తాజాగా జియో మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ఆగస్టులో 84 లక్షలకుపైగా వినియోగదారులు జియో నెట్వర్క్లోకి చేరినట్లు ట్రాయ్ సంస్థ వెల్లడించింది. ఒకే నెలలో ఇంత పెద్ద సంఖ్యలో ఒక నెట్వర్క్లోకి వినియోగదారులు చేరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో జియో ఒకే నెలలో 2.49 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ల వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గినట్లు ట్రాయ్ వెల్లడించింది. ట్రాయ్ ఆగస్టు నివేదిక ప్రకారం..ప్రస్తుతం రిలయన్స్ జియోకు 34.80 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇదే నెలలో ఎయిర్టెల్ నుంచి 5 లక్షల మంది కస్టమర్లు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం ఎయిర్టెల్లో 32.70 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఎయిర్టెల్ కంటే వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ పెద్ద సంఖ్యలో వినియోగదారులను పోగొట్టుకుంది. దాదాపు 49 లక్షలకుపైగా ఈ నెట్వర్క్ను వీడగా.. ప్రస్తుతం 37.50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో వచ్చిన తరువాత వోడాఫోన్ ఐడియా ఒకటిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.