పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు...టర్కీకి భారత్ షాక్!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 06:11 PM

పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు...టర్కీకి భారత్ షాక్!

అంతర్జాతీయ వేదికల మీద పాకిస్థాన్‌కు చైనా, మలేసియా, టర్కీ అండగా భారత్ కు వ్యతిరేఖంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ మూడు దేశాలు పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించాయి. దీంతో ఈ దేశాలతో మోదీ సర్కారు తనదైన శైలిలో వ్యవహరిస్తోంది.మలేసియా నుంచి పామాయిల్ దిగుమతులపై సుంకాలను పెంచి ఝలక్ ఇచ్చిన భారత్.. తాజాగా టర్కీకి కూడా షాకిచ్చింది. టర్కీలోని అంకారాలో ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు పర్యటించాల్సి ఉంది. కానీ ఆ దేశాధ్యక్షుడు తయీప్ ఎర్డోగాన్.. ఐరాసలో ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని విమర్శించారు. దీంతో టర్కీ పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. అంతకు ముందు చైనాతో నేపాల్ ఒప్పందాలు చేసుకోకుండా భారత్ ఆపగలిగింది.ఐరాసలోనే కాదు ఇటీవల జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనూ పాకిస్థాన్‌కు టర్కీ మద్దతునిచ్చింది. దీంతో మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.టర్కీ వెళ్లి అక్కడి నుంచి సౌదీ అరేబియా వెళ్లేలా మోదీ షెడ్యూల్‌ను రూపొందించారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో సౌదీలో జరగబోయే మెగా ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. టర్కీ పర్యటనను రద్దు చేయడం పట్ల విదేశాంగ శాఖ స్పందించింది. ఆ పర్యటనను ఫైనలైజ్ చేయలేదని, కాబట్టి రద్దు చేయడమనేది సరికాదని పేర్కొంది. జీ20 సదస్సు కోసం ప్రధాని మోదీ 2015లో టర్కీ వెళ్లారు. ఈ ఏడాది జూన్‌లో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా టర్కీ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జూలై 2018లో టర్కీ అధినేత రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించారు.





Untitled Document
Advertisements