తెలంగాణ బాక్సర్ సవాల్‌కి స్పందించిన మేరీకోమ్

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 07:08 PM

తెలంగాణ బాక్సర్ సవాల్‌కి స్పందించిన మేరీకోమ్

భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కి వెళ్లే ముందు తనతో ఫైట్ చేయాలని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ విసిరిన సవాల్‌పై మేరీకోమ్ స్పందించింది. తొలుత జరీన్ ఎవరంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మేరీకోమ్.. 51 కిలోల కేటగిరీలో ట్రయల్స్‌ ఫైట్‌కి తాను సిద్ధమంటూ ప్రకటించింది. అంతేకాకుండా.. జరీన్‌కి మద్దతు తెలిపిన ఒలింపిక్స్ షూటింగ్‌లో గోల్డ్‌ మెడలిస్ట్ అభినవ్ బింద్రాపైనా మేరీకోమ్ మండిపడింది. అసలు మ్యాటరేంటంటే...సుదీర్ఘకాలంగా 48 కిలోల కేటగిరీలో పోటీపడుతున్న మేరీకోమ్.. ఆరు స్వర్ణాలు, ఒక రజత పతకం గెలుపొందింది. కానీ.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగం లేకపోవడంతో.. ఆమె ఇటీవల 51 కిలోల కేటగిరీకి మారింది. దీంతో.. ఇన్నాళ్లు 51 కిలోల విభాగంలో పోటీపడుతున్న జరీన్‌ని పక్కన పెట్టిన భారత బాక్సింగ్ ఫెడరేషన్.. ఇటీవల ఆ కేటగిరీలో మేరీకోమ్‌ని డైరెక్ట్‌గా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కి పంపింది. అక్కడ సెమీస్‌లోనే వెనుదిరిగిన మేరీకోమ్.. కాంస్య పతకంతో సరిపెట్టింది.51 కిలోల కేటగిరీలో ఇద్దరు బాక్సర్లు పోటీలో ఉన్న నేపథ్యంలో.. వారిద్దరి మధ్య ట్రయల్స్ నిర్వహించి విజేతని.. ఛాంపియన్‌షిప్‌కి పంపి ఉండాలని ఫెడరేషన్‌పై ఇటీవల జరీన్ మండిపడింది. తాజాగా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కి కూడా మేరీకోమ్‌ని డైరెక్ట్‌గా పంపాలని ఫెడరేషన్ పెద్దలు యోచిస్తుండటంతో.. జరీన్ నేరుగా కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకి లేఖ రాస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో.. మేరీకోమ్ ఎంపికపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.ఈ వివాదంపై తాజాగా మేరీకోమ్ మాట్లాడుతూ ‘అసలు నిఖత్ జరీన్ ఎవరు నాపై సవాల్ విసరడానికి..? ఆమెతో ఫైట్ చేయడానికి నాకేం భయం లేదు. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కి ముందు ట్రయల్స్‌లో జరీన్‌తో ఢీకొట్టేందుకు నేను రెడీ. నా అంచనా ప్రకారం.. ఆ మ్యాచ్‌లో నా గెలుపు నామమాత్రమే. అయినా.. బాక్సింగ్‌ గురించి ఏమి తెలుసని అభినవ్ బింద్రా మాట్లాడుతున్నాడు. అతను ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి ఉండొచ్చు. నేను కూడా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు గెలిచాను. అతనికి సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది’ అని సూచించింది.





Untitled Document
Advertisements