టెలికం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. టెలికామ్ విభాగం సమస్యలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ప్రభుత్వ ప్రణాళికను నెలలోపు బహిరంగపరుస్తామని బిఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పికె పూర్వర్ పేర్కొన్నారు. దీని కోసం పునరుద్ధరణ ప్యాకేజీ పనిలో నిమగ్నమయ్యామని, ఈ ప్యాకేజీలో సంస్థ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకం, ఆస్తులను అమ్మడం ద్వారా నిధులు సేకరించడం, 4జి స్పెక్ట్రం కేటాయింపు వంటివి ఉన్నాయి. దీపావళికి ముందే ఉద్యోగులకు జీతం కూడా లభిస్తుందని చెప్పారు. బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను చేర్చుకుంటోంది. కంపెనీ ఆదాయం రూ.20,000 కోట్లకు పైగా ఉందని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మనుగడ దేశానికి చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ సంస్థను నడిపించడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉచితంగా సేవలను అందించే మొదటి సంస్థ బిఎస్ఎన్ఎల్ అని ప్రసాద్ చెప్పారు. సంస్థ ఆదాయంలో 75 శాతం ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి ఉపయోగిస్తారు. ఇతర కంపెనీలు దీని కోసం ఐదు నుంచి 10 శాతం మాత్రమే ఖర్చు చేస్తాయి.