బస్సులను అడ్డుకున్నా, దాడులు చేసినా జైలుకే...పోలీసుల వార్నింగ్

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 07:19 PM

బస్సులను అడ్డుకున్నా, దాడులు చేసినా జైలుకే...పోలీసుల వార్నింగ్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు, ప్రైవేట్ డ్రైవర్లపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని.. జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. అటు రోడ్లపై బస్సులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించేలా, ఎలాంటి అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సూచనతో డీజీపీ ఆదేశాల మేరకు బుధవారం (అక్టోబర్ 23) ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాల వారిగా పోలీస్ బాస్‌లు హెచ్చరికలు చేస్తున్నారు.హైదరాబాద్‌లో నడుస్తున్న ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను అడ్డుకున్నా.. ఆ వాహనాలను నడుపుతున్న డ్రైవర్లపై దాడులు చేసినా కఠిన చర్యలు తప్పవని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను అడ్డుకున్నా, డ్రైవర్లపై దాడులు చేసినా కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్‌‌ కోర్టుల ఎదుట విచారణకు హాజరు పరుస్తామని ఆయన స్పష్టం చేశారు.ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించేలా ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపై ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో లాంటివి చేపడితే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నడిచే బస్సులను అడ్డగించి ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తే కేసులు పెట్టి ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో విచారణకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి వికారాబాద్ ఎస్పీ ఎం నారాయణ పలు హెచ్చరికలు జారీ చేశారు. డిపోల ముందు, బస్టాండ్ గేట్ల పరిసరాల్లో గుంపులుగా ఉండటం, ఆందోళనలు నిర్వహించడం చేయొద్దని తెలిపారు.ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులు బస్సులను అడ్డుకోవడం, బస్సులపై దాడి చేయడం, విధుల్లో ఉన్న తాత్కాలిక సిబ్బందిని ఇబ్బందులకు గురి చేసినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని వికారాబాద్ ఎస్పీ హెచ్చరించారు.ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్న వారిపై పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాలలో తాత్కాలిక సిబ్బంది విధులకు ఇబ్బంది కలిగించిన కేసులో 18 మంది ఉద్యోగులు, 32 మంది వివిధ రాజకీయ పార్టీల నేతలను అరెస్టు చేశారు. మంగళవారం మంచిర్యాల డిపో వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. గద్వాలలో విధులకు ఆటంకం కలిగించిన కేసులో నలుగురిని, కొత్తగూడెంలో బస్సులపై దాడి చేసిన కేసులు ఇద్దరిని అరెస్టు చేశారు.





Untitled Document
Advertisements