ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు దీక్ష...మందకృష్ణ హౌస్ అరెస్ట్

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 01:12 PM

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు దీక్ష...మందకృష్ణ హౌస్ అరెస్ట్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆదివారం సబ్బండ వర్గాలు దీక్ష జరపాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయించింది. అయితే దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో ముందస్తుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను హౌస్ అరెస్ట్ చేశారు. దీక్షలో పాల్గొడానికి ఇందిరాపార్క్ దగ్గరకు వస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందిరాపార్క్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. ఎమ్మార్పీఎస్ దీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పథకం వేశారని తమకు సమాచారం తమకు అందడంతోనే దీక్షకు అనుమతి నిరాకరించామని పోలీసులు అంటున్నారు. మంద కృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆయనను అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు పేదవారు ఉన్నారని, వారు చేస్తున్న సమ్మె న్యాయమైనదని వ్యాఖ్యానించారు. సబ్బండ వర్గాల మద్దతు ఆర్టీసీ వర్గాలకు ఉండాలని దీక్షకు సిద్దపడ్డామని తెలిపారు. కానీ దీక్షకు అనుమతి ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితిల్లోనూ భవిష్యత్తులో దీక్షను చేసి తీరుతామని మంద కృష్ణ స్పష్టం చేశారు. మరోవైపు, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్వీయ గృహ నిర్బంధం కొనసాగుతోంది. ఇందిరాపార్కు వద్ద శనివారం నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించి, ఆ పరిసరాల్లో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీంతో జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తన ఇంట్లోనే నిరాహారదీక్షకు దిగారు. ఎల్బీనగర్‌ హస్తినాపురం డివిజన్‌ జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లోని తన నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకోవడంతో పోలీసులు అక్కడకు సాధారణ దుస్తుల్లో వెళ్లారు. ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి యత్నించడంతో ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకున్నారు. గదిలో నుంచే అశ్వత్థామరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముందస్తు అరెస్టులకు వెనుకడుగు వేయబోమని, చర్చలకు పిలిచేవరకూ ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఆందోళనలు ఆపేది లేదని పునరుద్ఘాటించారు.








Untitled Document
Advertisements