క్రికెట్లో తిరిగి పునరాగమనం చేసిన టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో అసోం బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ముంబయి తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీషా కేవలం 39 బంతుల్లో 63 పరుగులు చేశాడు. పునరాగమనం చేసిన తొలి మ్యాచ్లోనే చెలరేగిన పృథ్వీషాకు బిసిసిఐ స్వాగతం పలికింది. అతడి అర్ధ శతకం సెబ్రేషన్ను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆదిత్య( 82)కూడా అర్ధ శతకంతో రాణించడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన అసోం 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేసింది. దీంతో ముంబయి 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన పృథ్వీ షాను బిసిసిఐ 8 నెలల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో అతతడు ముప్తాక్ అలీ టోర్నమెంటు ఆడాడు. ఈ సమయంలో జలుబు చేయడంతో మందుల దుకాణంనుంచి దగ్గుమందు కొనుగోలు చేశాడు. అందులో ‘వాడా’ బహిష్కృత డ్రగ్ ‘టర్బులిన్’ ఉంది.ఆటగాళ్లు ముందుగా బోర్డు అనుమతి తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తొందరపాటుతో పృథ్వీషా ఈ విషయం బోర్డుకు తెలియజేయలేదు. ఫలితంగా ఎనిమిది నెలల సస్పెన్షన్ను ఎదుర్కొన్నాడు. ఈ నెల 15తో అతడి సస్పెన్షన్ ముగిసింది. గత వారంలో పుట్టిన రోజు జరుపుకొన్న అతను పునరాగమనం తర్వాత చెలరేగుతాన్న ధీమాను వ్యక్తం చేశాడు. ఇకపై మీరు పృథ్వీషా 2.0ను చూస్తారని ట్వీట్ చేశాడు.