తిరువనంతపురం వేదికగా విండీస్ తో జరుగుతున్న రెండో టీ20లో టీం ఇండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. కాగా భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (11 బంతుల్లో 11; 1 ఫోరు) ఆరంభంలోనే ఔటవగా.. వన్డౌన్లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి బదులుగా ఆల్రౌండర్ శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ఈమేరకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. దీంతో సొంతమైదానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగుతాడని ఆశించిన అభిమానులక నిరాశే ఎదురైంది. మరోవైపు వెస్టిండీస్ ఒక మార్పు చేసింది. వికెట్కీపర్ దినేశ్ రామ్దిన్ స్థానంలో నికోలస్ పూరన్ తీసుకుంది. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చింది. ప్రత్యర్థి 207 పరుగుల భారీస్కోరు సాధించినా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ లోకేశ్ రాహుల్ సత్తాచాటడంతో కొండంత లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టీ20లో నెగ్గి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. తొలిమ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. అతను ఈ మ్యాచ్లో పుంజుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు మరో సిక్సర్ కొడితే 400 సిక్సర్లు కొట్టిన జాబితాలో తన ప్రవేశిస్తాడు. ఇక లోకేశ్ రాహుల్, కెప్టెన్ కోహ్లీ సూపర్ టచ్లో ఉన్నారు. తొలి మ్యాచ్లో వీరిద్దరూ నిలకడగా రాణించడంతో భారత్ సునాయాసంగానే గెలుపొందింది. అయితే మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ సత్తాచాటాల్సిన అవసరముంది. ఇక హైదరాబాద్ టీ20 ఓటమితో వెస్టిండీస్ జట్టు నిరాశలో ఉంది. బ్యాట్స్మెన్ రాణించినా దారుణమైన ఫీల్డింగ్, బౌలింగ్తోనే ఓడిపోయామని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈక్రమంలో ఈ మ్యాచ్లో పొరపాట్లను సరిదిద్దుకోవాలని భావిస్తోంది. అలాగా విండీస్కిది చావోరేవోలాంటి మ్యాచ్. ఈ మ్యాచ్లో ఓడితే సిరీస్ భారత్ వశమవుతుంది. దీంతో కరీబియన్జట్టు అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొని బరిలోకి దిగుతోంది.