ఇక బాదుడే

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 07:39 AM

వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల పెంపునకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన ఈ వస్తు, సేవల పన్ను.. ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండి కొడుతున్నది. దీంతో జీఎస్టీలోని వస్తు, సేవలపై పన్నులను పెంచాలని మోదీ సర్కారు భావిస్తున్నది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ నినాదంతో దాదాపు రెండున్నరేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకువచ్చింది. అటు కేంద్రం, ఇటు రాష్ర్టాల్లో ఉన్న డజనుకు పైగా పన్నులను ఏకం చేసి పరిచయం చేసిన జీఎస్టీ పరిధిలో 500లకు పైగా సేవలు, 1,300లకు పైగా వస్తువులున్నాయి. 0, 5, 12, 18, 28 శాతాల్లో ఆయా వస్తు, సేవలపై పన్నులను విధించారు. బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం పన్ను వేయగా, విలువైన ముడి రత్నాలు, రాళ్లపై కనిష్ఠంగా 0.25 శాతం పన్ను నిర్ణయించారు. ఇక పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చని కేంద్రం.. విద్య, వైద్యం, తాజా కూరగాయలు తదితరాలకు ఈ పన్ను నుంచి మినహాయింపు నిచ్చింది.

ఇక జీఎస్టీతో ఖజానాకు పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అమాంతం పడిపోయింది. మరోవైపు జీఎస్టీ కారణంగా ఆదాయాన్ని కోల్పోతున్న రాష్ర్టాలకు ఐదేండ్లు నష్టపరిహారం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో కేంద్రం పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ఆగస్టు నుంచి రాష్ర్టాలకు జీఎస్టీ నష్టపరిహారం అందడం లేదు. మీ నష్టాలకు మేము పరిహారం చెల్లించలేమని కూడా రాష్ర్టాలకు కేంద్రం చెప్పేసింది. జీఎస్టీ వసూళ్ల క్షీణతకు తోడు ఆర్థిక మందగమనం పరిస్థితులూ కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో పన్ను మినహాయింపు ఇచ్చిన వస్తు, సేవలపై తిరిగి పన్నులను వేయాలన్న నిర్ణయానికి మోదీ సర్కారు వస్తున్నట్లు సమాచారం. జీఎస్టీ భారమైన రంగాల విజ్ఞప్తులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయా వస్తు, సేవలపై పన్నును కేంద్రం ఇన్నాళ్లూ తగ్గిస్తూ పోయింది. దీంతో గరిష్ఠ పన్ను రేటు 28 శాతం శ్లాబులో అతికొద్ది వస్తూత్పత్తులే మిగిలాయి. పైగా చాలావాటికి పన్ను నుంచి మినహాయింపునూ ఇచ్చారు. దీంతో వసూళ్లు రాన్రాను పడిపోయాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

అటు జీఎస్టీ ఆదాయాన్ని దాదాపు మరో లక్ష కోట్ల రూపాయల మేర పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. శ్లాబులను మార్చి, పన్ను రేట్లను పెంచి, కొత్త పన్నులను విధించడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సర్కారు ప్రధాన ఆలోచన. 18 శాతం శ్లాబులోకి కనీసం 243 వస్తువులు చేరే వీలుందని తెలుస్తుండగా, దీనివల్ల వినియోగదారులపై భారం పడినా.. ఖజానాకు కాసుల వర్షం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయా వస్తువులపై నేరుగా కాకుండా వాటి ముడి సరుకులపై పన్నులను పెంచాలని కూడా కేంద్రం యోచిస్తున్నది.

మరోవైపు జీఎస్టీ భారం పెరిగితే ప్రజల్లో ఆందోళనలు ఖాయమన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవనశైలిని పెంపు నిర్ణయం ప్రభావితం చేస్తుందన్న భయాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకూ ఇది దారితీయవచ్చన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అటు ఆర్థిక మందగమన పరిస్థితులున్న వేళ జీఎస్టీ భారం పెంచితే ఇబ్బందన్న కోణంలో కేంద్రం కూడా ఆలోచిస్తున్నది. దీంతో మొదట లగ్జరీ ఉత్పత్తులపై పన్నును పెంచాలని, చివరకు సామాన్యులను ప్రభావితం చేసే వస్తు, సేవల జోలికి వెళ్లాలని మోదీ సర్కారు అనుకుంటున్నది. మొత్తానికి ఇప్పుడు అందరి చూపు.. రాబోయే జీఎస్టీ మండలి సమావేశంపైనే నెలకొన్నది.





Untitled Document
Advertisements