ఇండియాలో వారిద్దరితోనే సాధ్యం!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 11:08 AM

ఇండియాలో వారిద్దరితోనే సాధ్యం!

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా 15 ఏళ్ల కిందట టెస్టుల్లో సాధించిన 400 పరుగుల రికార్డ్‌కి దశాబ్దన్నర కాలంలో ఏ క్రికెటర్‌ కూడా చేరువకాలేకపోతున్నారు. ఇటీవల పాకిస్థాన్‌‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ 335 పరుగులతో లారా రికార్డ్‌‌ని బ్రేక్ చేసేలా కనిపించాడు. కానీ.. అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్‌పైన్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేయడంతో వార్నర్ 335 పరుగులతో నాటౌట్‌గా నిలిచిపోయాడు. దీంతో.. నిరీక్షణ మళ్లీ కొనసాగుతోంది.ఇంగ్లాండ్‌తో 2004లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 582 బంతులు ఎదుర్కొన్న బ్రియాన్ లారా 43 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 400 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటి నుంచి టెస్టుల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుకాగా.. చాలా మంది క్రికెటర్లు ఈ రికార్డ్‌ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. ఎవరూ కనీసం చేరువలోకి కూడా వెళ్లలేకపోయారు. అయితే.. భారత్ నుంచి ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయగలరని స్వయంగా బ్రియాన్ లారా జోస్యం చెప్పాడు.‘టెస్టుల్లో నా 400 పరుగుల రికార్డ్‌ని భారత క్రికెటర్లు రోహిత్ శర్మ లేదా పృథ్వీ షా బ్రేక్ చేసే అవకాశం ఉంది. టెస్టుల్లో రోహిత్ శర్మ ఇలానే కొనసాగితే.. తనదైన రోజున.. మంచి పిచ్, పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా ఆ రికార్డ్‌ని అందుకోగలడు. కానీ.. ఆరంభం నుంచి అతను బ్యాటింగ్‌లో అటాకింగ్ ఆప్షన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక మరో క్రికెటర్ పృథ్వీ షా ఇటీవల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడని నాకు తెలుసు. అయితే.. అతను మంచి అటాకింగ్ బ్యాట్స్‌మెన్. వయసు కూడా 19 ఏళ్లే కాబట్టి.. పృథ్వీషా కొన్నేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉంది. అతను తప్పకుండా.. త్వరలోనే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడు’ అని లారా వెల్లడించాడు.నిషేధిత ఉత్ప్రేరకం వాడటం ద్వారా ఎనిమిది నెలలు నిషేధానికి గురైన పృథ్వీ షా ఇటీవల మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 లీగ్‌లో ముంబయి తరఫున ఆడిన ఈ యువ ఓపెనర్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. కానీ.. ఈ ఏడాది భారత్ జట్టు ఇక టెస్టులు ఆడే అవకాశం లేకపోవడంతో.. వచ్చే ఏడాది అతను మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.





Untitled Document
Advertisements