ఎన్టీఆర్‌ను దించుతున్న బన్నీ!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 09:53 PM

ఎన్టీఆర్‌ను దించుతున్న బన్నీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను స్టైలిష్ స్టార్ రంగంలోకి దించుతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇప్పటికే ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య బావ అని పిలుచుకునేంత చనువు ఉంది. ఈ చిత్ర యూనిట్‌తో ఎన్టీఆర్‌కు ఉన్న ఈ అనుబంధంతోనే ఆయన్ను ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాలని అడిగారట. దీనికి ఎన్టీఆర్ కూడా అంగీకరించినట్టు సమాచారం. సంక్రాంతి రేసులో ఎన్టీఆర్ ఎలాగూ లేరు కాబట్టి.. ఆయన ఈ ఈవెంట్‌కు రావడం వల్ల బన్నీ నందమూరి అభిమానులను కూడా టార్గెట్ చేసినట్టు అవుతుంది. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరువుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే కనుక నిజమైతే అభిమానుల్లో ఒక మంచి వాతావరణం జనరేట్ అవ్వడం ఖాయం. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్నేహంతో ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు వీళ్లతో పాటు బన్నీ కూడా చేరినట్టు అవుతుంది. చూద్దాం త్వరలో అధికారిక ప్రకటనలు వెలువడతాయో లేదో!






Untitled Document
Advertisements