టిక్టాక్ వీడియోపై రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరికి తుపాకీ కాల్పులు జరపడంతో నలుగురు గాయపడ్డారు. అగర్నగర్ లోని సోమ్ విహార్లో సోమవారం రాత్రి 10.02 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గాయపడిన బాధితులు నలుగురూ బ్రిజ్ విహార్, శేష్మహల్ ఎన్క్లేవ్లకు చెందిన వారు. నవంబర్ 29న జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి రెండు వర్గాల వారు హాజరయ్యారు. టిక్టాక్ వీడియో షూట్ చేయవద్దని బాధిత వర్గానికి నిందిత వర్గం వారు చెప్పారు. ఇది వివాదానికి దారి తీసింది. మరునాడు నిందితుడు ఒకరు బాధితుడిపై దాడి చేశాడు. కొన్ని రోజుల తరువాత బాధితులు నిందితుడి కోసం వెతికారు. ఒక నిందితుడి తల్లిని చూసి దూషించి దౌర్జన్యం చేశారని పోలీసులు చెప్పారు. తరువాత ఆమె కుమారుడు బాధిత వర్గాన్ని చంపుతానని బెదిరించాడు. సోమవారం రాత్రి మోటారు సైకిళ్లపై ముగ్గురు వెళ్లి ఒక గదిలో జూదం ఆడుతున్న మరో వర్గం వారిపై ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయారని పోలీసులు చెప్పారు. హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.