ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ కలిగినదిగా తేలింది. ఈ మేరకు ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. దాన్ని ఈ ఏటి గోల్డెన్ ట్వీట్గా అభివర్ణించింది. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్.. విజయీ భారత్. మళ్లీ గెలిచాం. అందరం కలిసి దృఢమైన సమగ్రమైన భారతావనిని నిర్మిద్దాం’ అని 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ అత్యంత వేగంగా ప్రజల్లోకి, ముఖ్యంగా యూత్లోకి దూసుకెళ్లి తెగ వైరలయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మోడీ చేసిన ట్వీట్కు ఊహించని రీతిలో రీట్వీట్లు, లైక్లు వచ్చి పడటంతో ట్వి టర్ హోరెత్తిపోయింది. మోదీ చేసిన ఈ ట్వీట్ ‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’గా నిలిచిందని ట్వి టర్ అధికారికంగా ప్రకటించింది. ఇక మోడీ ట్వీట్ తర్వాత నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన మరో ట్వీట్ ఎంఎస్ ధోని బర్త్డే సందర్భంగా విరాట్ కోహ్లి చేసిన ట్వీట్. ‘హ్యాపీ బర్త్డే మహి భాయ్. నమ్మకం, గౌరవం అనే పదాలకు అర్థం చాలా కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. నాకు అలాంటి ఫ్రెండ్షిప్ దొరికినందుకు, నీతో ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నందుకు చాలా గర్వం గా ఉంది. మా అందరికి నువ్వొక పెద్దన్నయ్యవు. నేను గతంలో చెప్పినట్లుగా, నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్వే’ అని కోహ్లి తన ట్వీట్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా కోహ్లిలోని అంతరంగ భావాలను ఈ ట్వీట్లో వ్యక్తపరిచాడంటూ నెటిజన్లు ప్రశంసించారు. దీంతో కోహ్లి ట్వీట్కు ఊహించని రీతిలో రీ ట్వీట్, లైక్లు వచ్చిపడ్డాయి. దీం తో మోడీ తర్వాత రెండో గోల్టెన్ ట్వీట్గా ఇది నిలిచింది. ఇక ఓవరాల్గా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా విభాగంలో అత్యధికమంది లైక్, రీట్వీట్ చేసింది కోహ్లి ట్వీట్నే కావడం విశేషం. ఆ తర్వాత ఎక్కువమంది ప్రజానీకం చంద్రయాన్-2పై ఎక్కువగా ఆసక్తి కనబర్చారు. ఈ ఏడాది బాగా ట్రెండ్ అయిన హ్యాష్ట్యాగ్ ‘#loksabha elections2019’ అని ట్విటర్ పేర్కొంది. అనంతరం వరుసగా #chandrayaan2, #cwc19, #pulwama, #article370, #bigil, #diwali, #avengersendgame, #ayodhyaverdict, #eidmubarak హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయని ప్రకటించింది. సినిమాల విషయంలో తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన విజిల్ చిత్రంపై నెటిజన్లు తెగ ఆసక్తి కనబర్చారు.