బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను దివాళా తీసినట్టు ప్రకటించాలని 12 భారత బ్యాంకులు మంగళవారం లండన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. మాల్యాకు 10,000 కోట్ల రూపాయల అప్పు ఉందని, ఆయన ఇంకా ఎటువంటి చెల్లింపు చేయలేదని బ్యాంకుల తరఫు న్యాయవాది మార్సియా షెకార్దమియన్ కోర్టుకు తెలిపినట్టు బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. అయితే మాల్యాను అప్పగించే కేసులో తీర్పు వచ్చే వరకు విచారణ వాయిదా పడింది. మాల్యా 20 సంవత్సరాలుగా లండన్లో ఉంటున్నారని, ఆయనకు ఇల్లు, ఆస్తులు ఉన్నందున దివాలా పిటిషన్ దాఖలైంది. వీటిలో 280 కోట్ల రూపాయల విలువైన టౌన్హౌస్, 100 కోట్ల రూపాయల విలువైన భవనం, మూడు పడవలు, ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ జట్టులో వాటా ఉన్నాయి. అయితే బ్యాంకుల విజ్ఞప్తిని కొట్టివేయాలని మాల్యా తరఫు న్యాయవాది ఫిలిప్ మార్షల్ కోరారు.