గుడ్ న్యూస్...ఇకపై పేటీఎం నుంచి లోన్స్!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 04:17 PM

గుడ్ న్యూస్...ఇకపై పేటీఎం నుంచి లోన్స్!

ఆన్‌లైన్ లెండింగ్ వ్యాపారంలోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టాలని భావిస్తోంది దిగ్గజ ఇ-వాలెట్ సంస్థ పేటీఎం. లెండింగ్ బిజినెస్ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. పేటీఎం ఇప్పటకే ఆన్‌లైన్ లెండింగ్ బిజినెస్‌కు సంబంధించి ట్రయల్స్ నిర్వహించింది. గత ఏడాది జూలై నెలలోనే పేటీఎం పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆన్‌లైన్ లోన్స్ అందించడం ప్రారంభించింది. దీని కోసం క్లిక్స్ క్యాపిటల్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇ-వాలెట్ సహా ఈ-కామర్స్ సంస్థగా పేరొందిన పేటీఎం ఆదాయాన్ని పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే లెండింగ్ బిజినెస్‌ను సీరియస్‌గా తీసుకుంటోంది. దీని ద్వారా ఆదాయం పొందాలని యోచిస్తోంది. కంపెనీకి ప్రధాన ఆదాయ వనరుగా ఈ విభాగాన్ని తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తోంది. పేటీఎం ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆన్‌లైన్ లెండింగ్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శర్మ మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించామని, దీని వల్ల కేస్ స్టడీ పూర్తిచేశామని, ఇక రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పేటీఎం ఆన్‌లైన్ బిజినెస్‌ను మరింత విస్తరించడానికి నాన్ బ్యాంకింగ్ సంస్థలతో జతకట్టింది. నాన్ బ్యాంకింగ్ కంపెనీల ద్వారా లెండింగ్ వ్యాపారాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. వన్97 కంపెనీకి చెందిన పేటీఎం ఆన్‌లైన్ లెండింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కచ్చితంగా లైసెన్స్ పొంది తీరాలి. రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్ తీసుకోవాలి. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ ఎలా పొందాలనే అంశంపై చర్చిస్తున్నామని సౌరభ్ శర్మ తెలిపారు. పేటీఎంకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది. అయితే రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం పేమెంట్స్ బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలోనే పేటీఎం రుణాలు అందించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్‌బీఐకి రిక్వెస్ట్ పెట్టుకుంది. ఇండియా పోస్ట్ కూడా ఇలాంటి రిక్వెస్ట్‌నే ఆర్‌బీఐకి పంపింది. పేటీఎం అనతి కాలంలోనే దిగ్గజ ఇవాలెట్ సంస్థగా ఆవిర్భవించింది. ఈ కంపెనీకి ఏకంగా 15 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అలాగే 1.5 కోట్ల మంది వ్యాపారులు పేటీఎం ఉపయోగిస్తున్నారు. పేటీఎం ఇటీవలనే కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్ ఇన్ వన్ క్యూఆర్ పేరుతో ఈ సర్వీసులు లాంచ్ చేసింది. దీంతో పేటీఎం వాలెట్, రూపే కార్డ్స్, అన్ని రకాల యూపీఐ యాప్స్ ద్వారా చెల్లింపులు స్వీకరించొచ్చు. డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి.





Untitled Document
Advertisements