తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మరియు తెరాస ల మధ్య రసవత్తరంగా రాజకీయ విమర్శలు నడుస్తున్నాయి. తెరాస మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గానూ, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసారని అన్నారు. న్యాయమైన పద్దతిలో వ్యవహరిస్తే తెరాస కు ఒక్క సీటు కూడా రాదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
ఎన్నికల ప్రకటన, నామినేషన్ ప్రక్రియ మధ్య వ్యవధి లేకపోవడం వలనే అభ్యర్థుల్ని ప్రకటించలేకపోయాం అని తెలిపారు. అయితే తెరాస నేతలు పోలిసుల సహాయంతో నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అభ్యర్థుల్ని కొట్టి, వేసిన నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించుకునేలా చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. బ్యాక్ డోర్ పద్దతుల ద్వారా విజయాన్ని సాదించేందుకు తెరాస ప్రయత్నిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.