IND vs AUS 3rd ODI: భారత తుది జట్టు..పలు మార్పులు?!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 09:02 PM

IND vs AUS 3rd ODI: భారత తుది జట్టు..పలు మార్పులు?!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అవమానకరరీతిలో ఓడిపోయినా.. రెండోవన్డేలో వెంటనే తేరుకుని ప్రత్యర్థికి షాకిచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాలలో ప్రత్యర్థిని ‘కంగారూ’ పెట్టి 36 పరుగులతో విజయం సాధించింది. ఈక్రమంలో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో బెంగళూరులో ఆదివారం జరిగే మూడో వన్డేపై అందరి ఫోకస్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. దీంతో గతేడాది ఆ జట్టు చేతిలో వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవతుందని ఆలోచిస్తోంది. ఈక్రమంలో ఫైనల్ వన్డేకు భారత తుది జట్టు ఇలా ఉండే అవకాశముంది. ఈ వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్లు సత్తాచాటారు. ముఖ్యంగా తీవ్రమైన పోటీ మధ్య జట్టులో చోటు దక్కించుకున్న ధావన్.. అదరగొడుతున్నాడు. గత రెండు వన్డేల్లో తానే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే రెండో వన్డేలో పక్కటెముకల గాయానికి గురైన ధావన్ ఆడటంపై స్ఫష్టత లేదు. మ్యాచ్‌కు ముందు దీనిపై ప్రకటన చేస్తామని బీసీసీఐ తెలిపింది. ధావన్ వైదొలిగితే లోకేశ్ రాహుల్ అతని ప్లేస్‌లో ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది. ఈ వన్డే సిరీస్‌లో విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. తొలి వన్డేలో కేవలం 10 పరుగులకు ఔటైన హిట్‌మ్యాన్.. మలి వన్డేలో 42 పరుగులు బాది ఫర్వాలేదనిపించాడు. అయితే మూడో వన్డే వేదిక చిన్నస్వామి స్టేడియంలో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో కంగారూలపైనే తాను డబుల్ సెంచరీ సాధించాడు. ఈక్రమంలో ఈ మ్యాచ్‌లో అలాంటి ప్రదర్శననేజట్టు యాజమాన్యం అతని నుంచి ఆశిస్తోంది. తొలి వన్డేలో ప్రయోగాలకుపోయి నాలుగోస్థానంలో బరిలోకి దిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శల పాలయ్యాడు. దీంతో రెండో వన్డేలో తన రెగ్యులర్ స్థానం నం.3లో ఆడి 78 పరుగులతో సత్తాచాటాడు. తన నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌నే భారత్ కోరుకుంటోంది. ఐపీఎల్లో సొంతగడ్డ బెంగళూరులో కోహ్లీకి రికార్డేమీ బాగాలేదు. ఈక్రమంలో ఈ మ్యాచ్‌లో తను సత్తాచాటి ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాడు. భారత మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, మనీశ్ పాండేలతో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా ఇటీవల లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లో అదరగొడుతున్న లోకేశ్ రాహుల్‌పై భారీ అంచనాలున్నాయి. తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన రాహుల్.. రెండో వన్డేలో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. మరోవైపు రిషబ్ పంత్ గాయంతో దూరమవడంతో వికెట్ కీపర్‌గాను ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. పంత్ మూడో వన్డేకు కూడా దూరమయ్యే చాన్స్ ఉండటంతో ఈ మ్యాచ్‌లోనూ తను వికెట్ కీపింగ్ చేస్తాడని తెలుస్తోంది. వన్డే సిరీస్‌లో శ్రేయస్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు వన్డేల్లోనూ సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యాడు. కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతున్న శ్రేయస్.. సత్తాచాటడం తప్పనిసరి. ఈక్రమంలో మూడో వన్డేలో తను బ్యాట్ ఝుళిపించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఇక రెండో వన్డేలో బ్యాటింగ్ లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేని పాండే.. ఈ మ్యాచ్‌లోనైనా సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో స్థానం పొందిన రవీంద్ర జడేజా ఫర్వాలేదనిపిస్తున్నాడు. రెండు వన్డేల్లోనూ 20+ స్కోర్లు చేసినా వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోయాడు. ఇక బౌలింగ్‌లో ముంబై వన్డేలో తేలిపోయిన జడ్డూ.. రాజ్‌కోట్‌లో పుంజుకున్నాడు. కీలకమైన ఆరోన్ ఫించ్, మార్నస్ లబుషేన్ వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మూడో వన్డేలోనూ రెండు విభాగాల్లో తను సత్తాచాటాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. పీడకలగా మారిన ముంబై వన్డేలో అనంతరం రాజ్‌కోట్‌లో భారత బౌలర్లు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ముఖ్యంగా బౌలింగ్ చేసిన ప్రతీ ప్లేయర్ కనీసం ఒక వికెట్ తీయడం విశేషం. గత వన్డేలో అందరికంటే ఎక్కువగా మహ్మద్ షమీ ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. రెండోవన్డేలో ఒక్క వికెట్ మాత్రమే తీసినా జస్‌ప్రీత్ బుమ్రా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ స్వర్గధామంలాంటి వికెట్‌పై కేవలం 5.07 ఎకానమీతో పరుగులిచ్చాడు. తను స్థాయికి ఆటతీరును మూడో వన్డేలో కనబరిస్తే కంగారూలకు చెమటలు పట్టడం ఖాయమే. రాజ్‌కోట్‌ వన్డేలో రెండు వికెట్లు తీసి ఆసీస్‌ను వణికించిన కుల్దీప్ యాదవ్.. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా నిలిచాడు. కీలకమైన అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ వికెట్లను ఒకే ఓవర్లో తీయడంతో మ్యాచ్ భారత్ వశమైంది. ఇక శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చిన నవదీప్ సైనీ సత్తాచాటుతున్నాడు. గత మ్యాచ్‌లో బుల్లెట్‌లాంటి యార్కర్లతో లోయర్ ఆర్డర్ పనిపట్టి భారత్ విజాయన్ని ఖరారు చేశాడు. బౌలర్లంతా ఫుల్లు ఫామ్‌లో ఉన్నారు కాబట్టి మూడో వన్డేలో ఆసీస్‌కు ముప్పు తప్పకపోవచ్చు.

​భారత జట్టు (అంచనా):

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, లోకేశ్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.

​ఆసీస్‌లో రెండు మార్పులు:

రెండో వన్డేలో ఓడిపోయిన ఆసీస్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసే అవకాశముంది. ఆష్టన్ ఆగర్ స్థానంలో డీఆర్సీ షార్ట్‌ను కేన్ రిచర్డ్‌సన్ ప్లేస్‌లో జోష్ హేజిల్‌వుడ్‌ను పరీక్షించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

​ఆస్ట్రేలియా జట్టు (అంచనా) :

ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, టర్నర్, ఆష్టన్ ఆగర్/డీ ఆర్సీ షార్ట్, ప్యాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, ఆడమ్ జంపా, రిచర్డ్‌సన్/హేజిల్‌వుడ్.





Untitled Document
Advertisements