అమరావతి.. అమరావతి.. అమరావతి.. ఏపీ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అమరావతి పేరు మార్మోగుతోంది. రాజధాని తరలింపునకు సంబంధించి కీలక ఘట్టానికి ఏపీ అసెంబ్లీ వేదికగా మారిన ఈ సమయంలో.. ఎక్కడ చూసినా అదే పేరు వినపడుతోంది. సోషల్ మీడియా కూడా అమరావతి పేరునే స్మరిస్తోంది. ట్విట్టర్ ట్రెండింగ్ లిస్టులో అమరావతి చోటు సంపాదించుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లు గొంతు విప్పుతున్నారు. తమ వ్యతిరేకతను ట్వీట్స్ ద్వారా తెలుపుతున్నారు. అమరావతి హ్యాష్ ట్యాగ్తో వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారు.
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ జేఏసీతో కలిసి రైతులు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతుంటే.. అసెంబ్లీలో అధికారపక్షం తనదారిన తాను వెళుతోంది. ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు తమ వాక్చాతుర్యంతో రాజధానిపై అవహేళనగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంపై కోపాన్ని అమరావతి నగర ప్రజలపై చూపుతున్నట్టు.. ప్రజల మధ్య వైషమ్యాలు రేకెత్తేలా అసెంబ్లీ సాక్షిగా ప్రకటనలు చేస్తున్నారు.