కూతురు పోయిన బాధలో ఉన్న తండ్రిని తన్నిన కానిస్టేబుల్ సస్పెండ్!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 04:50 PM

కూతురు పోయిన బాధలో ఉన్న తండ్రిని తన్నిన కానిస్టేబుల్ సస్పెండ్!

పటాన్‌చెరువులో ఆత్మహత్య చేసుకొని మరణించిన ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీస్ కానిస్టేబుల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానిస్టేబుల్‌ శ్రీధర్‌‌ను సస్పెండ్ చేయాలని హోం మంత్రి మహముద్‌ అలీ సంగారెడ్డి ఇంఛార్జీ ఎస్పీ చందనా దీప్తికి గురువారం (ఫిబ్రవరి 27) ఆదేశాలు జారీ చేశారు. దీంతో కానిస్టేబుల్ శ్రీధర్‌ను ఎస్పీ చందనా దీప్తి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. పుట్టెడు దు:ఖంలో ఉన్న వ్యక్తి పట్ల పోలీస్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. చర్యలు తీసుకోవాలంటూ హోంమంత్రిని కోరారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ ఇంటర్‌ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ భవనంలోని బాత్రూమ్ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె మృతి విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే.. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కాలేజీ ముందు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. సంధ్యారాణి మృతదేహాన్ని కాలేజీ వద్దకు తరలించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. సంధ్యారాణి మృతదేహాన్ని ఉంచిన పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు సంధ్యారాణి మృతదేహాన్ని తరలించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని నిలువరించే ప్రయత్నంలో శ్రీధర్ అనే కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించాడు. సంధ్యారాణి మృతదేహం ఉంచిన పెట్టెను పట్టుకొని రోదిస్తున్న ఆమె తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో తన్నాడు. ఈ దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పోలీసుల తీరుపై పలువురు మండిపడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ‘ప్రజలు దుఃఖ సమయాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించడం ప్రభుత్వ అధికారుల కనీస ధర్మం’ అని ట్వీట్‌ చేశారు. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని ట్యాగ్ చేశారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను సంగారెడ్డి ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ ఘటన దురదృష్టకరమని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు.






Untitled Document
Advertisements