కివీస్ గడ్డపై భారత్ చిత్తుగా ఓడిపోవడానికి కారణం!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 06:55 PM

కివీస్ గడ్డపై భారత్ చిత్తుగా ఓడిపోవడానికి కారణం!

న్యూజిలాండ్ గడ్డపై తొలి టెస్టులో భారత్ జట్టు చిత్తుగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడానికి కారణం.. బ్యాట్స్‌మెన్‌లు స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడమేనని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగసర్కార్ అభిప్రాయపడ్డాడు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 165, 191 పరుగులే చేసిన భారత్ జట్టు.. ఏ దశలోనూ కివీస్‌కి పోటీనిచ్చేలా కనిపించలేదు. వికెట్లు పడుతున్న సమయంలో బ్యాట్స్‌మెన్‌ మొండిగా క్రీజులో నిలిచేందుకు తాపత్రయపడ్డారు తప్ప.. స్ట్రైక్ రొటేట్ చేసేందుకు చూడలేదనే అభిప్రాయాలు వినిపించాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాలని వెంగ్‌సర్కార్ ఎండగట్టాడు. ముఖ్యంగా.. నెమ్మది ఇన్నింగ్స్‌లతో విసుగు తెప్పించిన పుజారాపై విమర్శలు గుప్పించాడు. ‘టెస్టుల్లో ఇప్పటి వరకూ పుజారా చాలా పరుగులు చేసుండొచ్చు. కానీ.. అతను స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. లేకపోతే.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉండే బ్యాట్స్‌మెన్.. తన రిథమ్‌ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. ఎక్కువసేపు నాన్‌స్ట్రైక్ ఎండ్‌ వైపు బ్యాట్స్‌మెన్ నిల్చొని ఉండటం అంత సులువు కాదు. పుజారానే కాదు.. రహానె కూడా స్ట్రైక్ రొటేషన్‌పై శ్రద్ధ పెట్టాలి’ అని సూచించాడు. తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 42 బంతులాడిన పుజారా 11 పరుగుల వద్దే వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ 81 బంతులాడిన పుజారా మళ్లీ 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఒకానొక దశలో బ్యాట్‌పై వచ్చిన బంతుల్ని కూడా వదిలేస్తూ వచ్చిన పుజారా.. ఆఖరి క్లీన్‌ బౌల్డయ్యాడు. మొత్తంగా.. రెండో ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్‌రేట్ 13.58కి పడిపోవడం గమనార్హం.





Untitled Document
Advertisements