కరోనా హెల్ప్‌లైన్‌‌‌కు కాల్ చేసి సమోసా ఆర్డర్...సరైన పనిష్మెంట్ ఇచ్చిన కలెక్టర్

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 12:41 PM

కరోనా హెల్ప్‌లైన్‌‌‌కు కాల్ చేసి సమోసా ఆర్డర్...సరైన పనిష్మెంట్ ఇచ్చిన కలెక్టర్

అసలే లాక్‌డౌన్ వల్ల పోలీసులు రేయింబవళ్లు రోడ్లపైనే గడుపుతుంటే.. ప్రజలు ఇళ్లల్లో ఉండకుండా బయటకు వచ్చి విసుగుతెప్పిస్తున్నారు. ఫలితంగా వారికి పోలీసులు ఎలా బుద్ధి చెబుతున్నారో తెలిసిందే. పోనీ, ఇంట్లో ఉన్నా కుదురుగా ఉంటున్నారా అంటే.. అదీ లేదు. అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లను దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు అదే చేశాడు. ఎలాంటి సహాయం కావాలన్నా మా హెల్ప్‌లైన్ నెంబరుకు ఫోన్ చేయండని పోలీసులు చేసిన ప్రచారాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నాడు. చివరికి చిక్కుల్లో పడ్డాడు. లాక్‌డౌన్ వల్ల ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం 24X7 సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ప్రజలు మాత్రం ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేసి అధికారులకు విసుగుతెప్పిస్తున్నారు. ఇటీవల ఓ యువకుడు ఫోన్ చేసి తనకు వేడి వేడి సమోసా తినాలని ఉందని, లాక్‌డౌన్ వల్ల షాపులు మూసి ఉన్నాయని తెలిపాడు. అలాంటి సేవలను హెల్ప్‌లైన్‌లో చేయరని ఆ యువకుడికి సర్ది చెప్పారు. ఒకసారి మంచిగా చెప్పినా ఆ యువకుడు వినలేదు. పదే పదే కాల్ చేస్తూ అధికారులను విసిగించాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న డీఎం ఆంజనేయ కుమార్ సింగ్ ఆ యువకుడి నాలుగు సమోసాలు తీసుకెళ్లి ఇవ్వండని సిబ్బందికి తెలిపాడు. అయితే, సమోసాలతోపాటు అదనంగా అతడికి మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. సమోసాలతో ఆ యువకుడి ఇంటికెళ్లిన పోలీసులు.. తనతో బయటకు రావాలని కోరారు. పారిశుద్ధ్య పరికరాలు ఇచ్చి డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా డీఎం అతడి ఫోటోను ట్వీట్ చేశారు. ‘‘నాలుగు సమోసాలు పంపించు అన్నాడు. దీంతో పంపాల్సి వచ్చింది. అనవసరంగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి విసిగిస్తున్న ఆ వ్యక్తితో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా పరిశుభ్రత పనులు చేయించాం’’ అని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements