భార్యలకు ప్రభుత్వం రిక్వెస్ట్...దయచేసి మీ భర్తలను ఏం అనకండి...!

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 07:09 PM

భార్యలకు ప్రభుత్వం రిక్వెస్ట్...దయచేసి మీ భర్తలను ఏం అనకండి...!

లాక్‌డౌన్ నేపథ్యంలో ఆఫీసులన్నీ మూతపడటంతో ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. వీరిలో చాలామంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఆ సదుపాయం లేనివాళ్లు, ఇతరాత్ర వ్యాపారాలు చేసేవాళ్లు మాత్రం ఇళ్లలో ఖాళీగానే ఉంటున్నారు. రోజూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండేవాళ్లంతా ఇప్పుడు ఏం చేయాలో తోచక ప్రతి నిమిషాన్ని ఒక యుగంలా గడుపుతున్నారు. అయితే, ఎక్కువ రోజులు ఇళ్లల్లో ఉండటం వల్ల భార్యలు భర్తలను హింసిస్తారనే ప్రచారమే కాదు జోకులు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివిధ దేశాల్లో గృహ హింస ఫిర్యాదులు కూడా పోలీసులకు అందుతున్నాయి. క్వారంటైన్ ఇలాగే కొనసాగితే విడాకుల కేసులు పెరుగుతాయనే ఆందోళన పెరుగుతోంది. ఖాళీగా ఉండే భర్తలో భార్యలు గొడవ పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మలేషియా ప్రభుత్వం కొన్ని వివాదాస్పద సూచనలు చేసింది. #WomenPreventCOVID19 హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ ప్రకటలపై మహిళ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో భార్యలు తమ భర్తలను చక్కగా చూసుకోవాలని, వారిని ప్రశాంతంగా ఉండనివ్వాలని మలేషియా ప్రభుత్వం సూచించింది. స్వయంగా మహిళా సంక్షేమ శాఖే ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కేవలం ఈ ఒక్క సూచనతో వదిలేస్తే ఇది పెద్ద వివాదం కాకపోయి ఉండేది. అదనంగా మరికొన్ని ఉచిత సలహాలు కూడా ప్రకటించారు. వీటిని చూస్తే.. మలేషియా మహిళలకే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ మహిళకైనా సరే ఆగ్రహం రాక మానదు. భర్తలు ‘వర్క్ ఫ్రం హోం’ చేస్తూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి, భార్యలు రోజూ మేకప్ వేసుకుని అందంగా తయారవ్వాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఇంట్లో పిచ్చి దుస్తులతో కాకుండా సౌకర్యవంతమైన వస్త్రాలను ధరించాలని పేర్కొంది. భర్తలతో కోపం, విసుగ్గా మాట్లాడకుండా డోరేమాన్ (ఆసియాలో పాపులర్ కార్టూన్ పాత్ర) తరహాలో వాయిస్‌తో ఎంతో వినయంగా మాట్లాడాలని సూచించింది. ఈ ప్రకటన చూడగానే.. మహిళలు ఉగ్రరూపం దాల్చారు. దీనిపై మలేషియాకు చెందిన ఆల్ ఉమెన్ యాక్షన్ సొసైటీ సభ్యురాలు నిషా సబనాయగం స్పందిస్తూ.. ఇలాంటి ప్రకటనలు చేయడం నిజంగా దిగజారుడుతనమేనని తెలిపారు. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రోజానా ఇసా మాట్లాడుతూ.. ‘‘భార్యలు భర్తకు లొంగి ఉండాలనే అర్థం వచ్చేలా ఈ ప్రకటనలు ఉన్నాయి. ఇది మహిళలపై వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్నాయి. ఇంట్లో పనిని భార్య, భర్తలిద్దరూ సమానంగా పంచుకోవాలి’’ అని తెలిపారు. పురుషులు సైతం మహిళలను హింసిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. ఈ ప్రకటనలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే ఆ పోస్టులను తొలగించి, క్షమాపణలు తెలియజేసింది. ‘‘మేం చేసిన ప్రకటన మహిళల మనోభావాలను దెబ్బతీసినట్లు తెలిసింది. అందుకే ఆ పోస్టర్లను తొలగిస్తున్నాం’’ అని తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత మలేషియాలో రోజుకు 2 వేల గృహ హింస, పిల్లలను హింసిస్తున్న ఫిర్యాదులు వస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. మున్ముందు వీటి సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై మహిళల స్పందనను కింది ట్వీట్లలో చూడగలరు.





Untitled Document
Advertisements