మాజీ రాష్ట్రపతులు, ప్రధానులతో మోదీ సమావేశం...కీలక నిర్ణయాలు

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 04:09 PM

మాజీ రాష్ట్రపతులు, ప్రధానులతో మోదీ సమావేశం...కీలక నిర్ణయాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడికి తీసుకున్న చర్యలు తదితర అంశాలపై చర్చించేందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా సింగ్ పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ‌లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. అలాగే, దేశంలోని విపక్ష నేతలను కూడా ఈ సమావేశానికి రావాలని కోరారు. సోనియా గాంధీ, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, కేసీఆర్, స్టాలిన్, ప్రకాశ్ సింగ్ బాదల్ సహా పలువురు విపక్ష నేతలకు మోదీ నుంచి పిలుపొచ్చింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం... నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో ప్రార్థనాలు చేసి వచ్చిన వారి ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా విపక్షాలతో ప్రధాని కీలక నిర్ణయాలు గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్ తదితర అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్‌లోని అన్ని పార్టీల నేతలతో ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లోని ఐదుగురు సభ్యుల సంఖ్యా బలం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 11.00 గంటలకు సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది.

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ విధించిన తర్వాత తొలిసారి విపక్షాలతో మోదీ భేటీ అవుతున్నారు. ఇకపై కరోనా వైరస్ విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై విపక్షాల నుంచి సూచనలు, సలహాలు కోరే అవకాశం ఉంది. అయితే, ప్రధాని మోదీ ఆహ్వానాన్ని తృణమూల్ కాంగ్రెస్ తిరస్కరించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మార్చి తొలివారంలో ఏర్పాటుచేసి అఖిలపక్షం సమావేశంలోనే కరోనా వైరస్ వ్యాప్తి అంశంపై లేవనెత్తామని, కానీ అప్పుడు దీనిని పట్టించుకోలేదని టీఎంసీ తెలిపింది.





Untitled Document
Advertisements