​భోజనానికి ముందు నీరు తాగితే బరువు తగ్గుతారా?

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 05:53 PM

​భోజనానికి ముందు నీరు తాగితే బరువు తగ్గుతారా?

బరువు తగ్గడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఛాలెంజ్‌గా మారింది. అనేక కారణాలతో పెరిగిన బరువుని ఎలాగైనా తగ్గించుకోవాలని.. తాము కూడా ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇందుకోసం అనేక వ్యయప్రయాసలు పడుతున్నారు. అయితే, మనం తెలిసో.. తెలియక చేసే కొన్ని పనులు మన బరువుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందులో ఒకటే భోజనానికి ముందు నీరు తీసుకోవడం. దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి.. నీరు జీవితానికి చాలా ముఖ్యం. తాగునీరు లేకుండా జీవనం అసాధ్యం. ఇది మానవ శరీరానికి చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. జీవక్రియ వేగవంతం అవుతుంది. జీర్ణ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. శరీరమంతా పోషకాలను బదిలీ చేస్తుంది. కణజాలం, కణాల పునరుద్ధరణలో పాల్గొంటుంది. తగినంత నీరు తాగని వ్యక్తులు రక్తహీనత, అజీర్ణంతో బాధపడవచ్చు. ప్రతి ఒక్కరూ తగినంత నీరు త్రాగటం మంచిదని మనందరికీ తెలుసు. అయితే బరువు తగ్గడానికి కూడా అవసరమే. ఎందుకంటే నీరు బరువు తగ్గటానికి సాయపడతుందని మనలో చాలా మందికి తెలియదు. నీరు వివిధ కణాలకు అవసరమైన పోషకాలను తీసుకువెళుతుంది. శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపుతుంది. అందుకని భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. దీని పై బ్లాక్స్ బర్గ్ లోని వర్జీనియా టెక్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ కాలేజీలోని హ్యూమన్ న్యూట్రిషన్, ఫుడ్స్ అండ్ ఎక్సర్‌సైజ్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. క్లినికల్ ట్రయల్ ప్రకారం ప్రతి భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగిన వారు 12 వారాలలో సగటున 2 కిలోలు, అంతకంటే ఎక్కువ బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనాన్ని 55 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న 48 మందిపై నిర్వహించారు. వీరి అందరిని రెండు గ్రూపులుగా విభజించారు. అయితే, ఒక గ్రూపు వారు ప్రతి భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగుతున్నారు ఈ పరిశోధనలో పాల్గొన్నవారు 12 వారాల పాటు ఇదే విధానాన్ని అనుసరించారు. మరో గ్రూపు సభ్యులు దీన్ని పాటించలేదు. రోజుకు మూడు సార్లు రెండు కప్పుల నీరు తాగిన గ్రూపు వారు ఇతర గ్రూపుతో పోలిస్తే 2 కిలోల అదనపు బరువు తగ్గారని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. మనలో చాలా మంది భోజనం చేసే ముందు నీరు తాగం. ఎందుకంటే నీటితోనే కడుపు నిండిపోతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే, భోజనానికి ముందు నీరు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఎందుకంటే మీరు భోజనానికి ముందు నీరు తాగినప్పుడు, తక్కువ తింటారు. రోజు ఆహారం తీసుకునే ముందు రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో మంచి ఫలితాలను చూస్తారు. ఎందుకంటే భోజనం ముందు నీరు తాగడం వల్ల మీరు తక్కువ కేలరీలను తీసుకుంటారు. అదేవిధంగా బరువు త్వరగా తగ్గుతారు. బరువు త్వరగా తగ్గాలని అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. త్వరగా బరువు తగ్గడానికి, ఎక్కువ ప్రయోజనాలు పొందటానికి , మీరు మీ ఆహారం నుంచి చక్కెర,అధిక కేలరీల డ్రింక్స్‌ని తగ్గించాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. అయితే, ఎక్కువ నీరు తాగడం కొంతమందికి ప్రమాదకరం. అందుకే ఈ విషయంలో ముందుగా మీరు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం





Untitled Document
Advertisements