వ్యవస్థలో మార్పు ఒక వ్యవస్థ...మార్పొచ్చింది!!!

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 03:48 PM

వ్యవస్థలో మార్పు ఒక వ్యవస్థ...మార్పొచ్చింది!!!

వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప, ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని, అందుకే ఒక వ్యవస్థను తీసుకొచ్చామని.. అదే గ్రామ సచివాలయ వ్యవస్థ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం జగన్‌ ప్రశంసించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు సోమవారం ప్రారంభమైంది.

ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘14 నెలల పాటు నా పాదయాత్ర 3,648 కిలో మీటర్లు సాగింది. పాదయాత్రలో ప్రజల కష్టాలు గమనించా. ప్రభుత్వం ఏర్పడ్డాక సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ. ప్రతి లబ్దిదారుడికి న్యాయం జరిగేలా చూస్తున్నాం. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ఉంచుతున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటివద్దకే సేవలు అందేలా చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వలంటీర్ల వ్యవస్థలో 82 శాతం అవకాశం కల్పించాం.

ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అవినీతి లేని పారదర్శకత ఉన్న వ్యవస్థ.. గ్రామ సచివాలయ వ్యవస్థ. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గ్రామ సచివాలయాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవ్వాతాతలకు నేరుగా ఇంటివద్దకే పెన్షన్ అందిస్తున్నాం. మత్స్యకార భరోసా, వాహనమిత్ర, వైఎస్సార్ బీమా పథకాలు తీసుకొచ్చాం. వలంటీర్లు, ఆశావర్కర్ల వ్యవస్థ ద్వారానే కరోనాను నియంత్రణ చర్యలు చేపట్టాం.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 43 వేల బెల్టుషాపులను తొలగించామని, మద్యం అమ్మకాల్లో ప్రైవేట్ వ్యక్తులను కూడా తొలగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. షాక్ కొట్టే విధంగా మద్యం ధరలు పెంచడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్నారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని, ప్రతి గ్రామంలో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్సార్‌ విలేజ్ క్లినిక్‌లను ప్రారంభిస్తామన్నారు. 24 గంటల పాటు గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో వ్యవసాయ నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తామని వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, త్వరలో గ్రామాల్లో జనతా బజార్లు తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.





Untitled Document
Advertisements