రైతన్నలకు రూ. 10 వేల కోట్లిచ్చాం: జగన్

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 04:15 PM

రైతన్నలకు రూ. 10 వేల కోట్లిచ్చాం: జగన్

వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతులు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మన లక్ష్యమని పేర్కొన్నారు. 3,648 కిలో మీటర్ల తన పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని గుర్తు చేసుకున్నారు. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు వెల్లడించారు. పంటల సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు లాభపడతారని సీఎం జగన్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులను ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించామన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని చెప్పారు. ఈ మూడు ప్రధాన అంశాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రైతు భరోసా - పీఎం కిసాన్‌ ద్వారా రైతన్నలకు రూ.13,500 పంటసాయం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12,500 ఇస్తామని మాట ఇచ్చినా.. రూ.13,500కు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే రైతు భరోసాను నాలుగేళ్లకు బదులు ఐదు సంవత్సరాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. తొలి ఏడాదిలోనే రైతులకు రూ.10,209 కోట్లు ఇచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, ఐదేళ్లలో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నామని, రూ.1,270 కోట్లు బీమా ప్రీమియం కూడా చెల్లించినట్లు చెప్పారు. పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు సహాయం అందాలని అధికారులను ఆదేశించారు. గతప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని పట్టించుకోలేదని, కానీ తాము మాత్రం రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు వివరించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామన్నారు. ఉచిత కరెంట్‌ ద్వారా ప్రతి రైతుకు రూ.49 వేలు లబ్ధి చేకూరుతోందని వివరించారు. దీని వల్ల ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8,800 కోట్లు భారం పడుతుందన్నారు. పగటిపూట కరెంట్‌ ఇచ్చేందుకు రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించామని, ఈ ఖరీఫ్‌ నాటికి 82 శాతం ఫీడర్లలో 9 గంటల ఉచిత విద్యుత్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మిగిలిన 18శాతం రబీ నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఆక్వా రైతులకు సైతం రూపాయిన్నరకే కరెంట్‌ ఇస్తున్నామని వివరించారు.






Untitled Document
Advertisements