ప్రధాని నిధికి చైనా సంస్థల భారీ విరాళాలు... ప్రశ్నించిన ప్రతిపక్షం

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 01:18 PM

ప్రధాని నిధికి చైనా సంస్థల భారీ విరాళాలు... ప్రశ్నించిన ప్రతిపక్షం

కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి భారీగా నిధులు వచ్చాయని బీజేపీ విమర్శలకు దిగిన వేళ, ఆ పార్టీ నేతలు, గడచిన మార్చిలో కరోనాపై పోరుకు ప్రధాని మోదీ ప్రకటించిన పీఎం కేర్స్ నిధికి చైనా కంపెనీల నుంచి అందిన నిధుల వివరాలను వెల్లడిస్తూ మండిపడ్డారు.

ప్రముఖ చైనా కంపెనీలు ఎన్నో పీఎం కేర్స్ కు భారీగా నిధులు ఇచ్చాయని, ఆ దేశం కారణంగా జాతి భద్రతకు ప్రమాదం వాటిల్లుతున్న వేళ, ఆ డబ్బులు ఎందుకు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఈ వివాదాస్పద నిధికి మే 20 నాటికి దాదాపు 9,678 కోట్లు వచ్చాయని వార్తలొచ్చాయని, ఈ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు.

అసలు చైనా కంపెనీల నుంచి నిధులను ఎందుకు తీసుకున్నారని నిలదీసిన ఆయన, ఈ నిధులు దారి మళ్లుతున్నాయని, అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదని ఆరోపించారు. కనీసం కాగ్ కూడా ఈ విషయంలో స్పందించడం లేదని మండిపడ్డారు.పీఎం కేర్స్ మోదీ సొంత నిధి అయిపోయిందని విమర్శలు గుప్పించారు. పీఎం కేర్స్ కు హువావే నుంచి రూ. 7 కోట్లు, టిక్ ‌టాక్‌ నుంచి రూ. 30 కోట్లు, 38 శాతం చైనా భాగస్వామ్యం వున్న పేటీఎం నుంచి రూ. 100 కోట్లు, షియోమీ నుంచి రూ. 15 కోట్లు, ఒప్పో నుంచి రూ. 1 కోటి పీఎం కేర్స్ కు విరాళంగా వచ్చాయా? లేదా? అని ప్రశ్నించారు.

కాగా, తాము పీఎం కేర్స్ కు రూ. 10 కోట్లు విరాళం ఇచ్చామని ఇటీవలి షియోమీ స్వయంగా ప్రకటించింది. ఒప్పో సంస్థ తాము కోటి రూపాయలు ఇచ్చామని అధికారికంగా వెల్లడించింది. పీఎం కేర్స్ నిధితో పాటు ఈ కంపెనీలు కొన్ని రాష్ట్రాల సీఎంల సహాయ నిధులకు కూడా కోట్ల రూపాయల విరాళాలు అందించాయి. చైనా దళాలు భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్న వేళ, ఆ దేశ కంపెనీల నుంచి విరాళాలు స్వీకరించడం బాధాకరమని వ్యాఖ్యానించిన అభిషేక్, ప్రధాని తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చైనా నిధులను తీసుకున్న మోదీ, ఆ దేశ దురాక్రమణ నుంచి భారత్ ను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు.





Untitled Document
Advertisements