"గాంధీలో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్లు పది మంది మాత్రమే"

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 04:00 PM


తెలంగాణ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాకే కరోనా వైరస్ కేసులు పెరిగాయని మంత్రి ఈటల తెలిపారు. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఈటల.. కరోనా వైరస్ గురించి తొలినాళ్లలో జనం భయం పడ్డారు. కానీ 4 నెలల తర్వాత మన దేశంలో ఎక్కువగా మరణాలు చోటు చేసుకోలేదన్నారు. 5 లక్షల పాజిటివ్ కేసులు నమోదైతే.. 3 శాతమే మరణాలు చోటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో డెత్ రేట్ 1.7 శాతం మాత్రమే ఉంది. ఈ 4 నెలల కాలంలో మన రాష్ట్రంలో 247 మంది చనిపోయారు.
‘‘ప్రజలు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ మరణాలు తక్కువగా ఉన్నాయి. గ్రామాల్లో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేశారు. గ్రామాల్లో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇతర నగరాల్లో తరహాలోనే హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏయే ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయో.. వాటి మీద ఫోకస్ పెట్టాలి, ఎక్కువగా టెస్టులు చేయాలి అని కేసీఆర్ సూచించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలన్నారు.

2800 స్వాబ్ కలెక్షన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మళ్లీ మంగళవారం నుంచి శాంపిళ్లను సేకరించి ప్రజలకు చికిత్స అందించే ప్రక్రియను కొనసాగిస్తాం. హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు పెరిగన చోట్ల.. జీహెచ్ఎంసీ, ఆరోగ్య సిబ్బంది సాయంతో పాత పద్ధతిలో కంటైన్మెట్ జోన్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు భయపడుతున్నట్లుగా అనిపిస్తోందన్న కేసీఆర్.. కరోనాను మాత్రం కట్టడి చేయాల్సిందేనన్నారు. అవసరమైతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందేనన్నారు. ఈ విషయంలో క్లారిటీ కోసం 4-5 రోజుల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఓ నిర్ణయానికి వస్తామన్నారు. గవర్నమెంట్ హాస్పిటళ్లలో పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. కానీ అది అవాస్తవం. వేరే పేషెంట్ల తరహాలో కరోనా లక్షణాలున్న వారు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి.. వారికి ఫోన్, ఇంటర్నెట్‌ను అందుబాటులో ఉంచారు.



చెస్ట్ హాస్పిటల్‌లో మరణించిన వ్యక్తి.. అనేక హాస్పిటళ్లు తిరిగిన తర్వాత అక్కడికి వచ్చారు. వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ ముఖ్యమనే ఉద్దేశంతో ఆక్సిజన్ అందించాం. అదే చెస్ట్ హాస్పిటల్‌లో హెడ్ నర్స్ చనిపోయింది. ప్రాణాలకు తెగించి కరోనా చికిత్స అందిస్తోన్న వైద్యసిబ్బందిపై ఆరోపణలు గుప్పించడం బాధాకరం.

వందల సంఖ్యలో ప్రభుత్వ వైద్య సిబ్బందికి, ఉద్యోగులకు కరోనా వచ్చిన నయం అవుతోంది. కానీ ఇతర సమస్యల కారణంగా చనిపోయిన వారిని హైలెట్ చేసి.. ప్రభుత్వ హాస్పిటళ్లలో పని చేసే వారి నైతిక స్థ్యైరాన్ని దెబ్బతీయొద్దు. లక్షణాలు లేకున్నా ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో, వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను, కేసీఆర్ అంకితభావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఏది మంచిదో అదే చేస్తున్నా. కేసీఆర్ టెస్టులు పెంచమని సూచించారు. కాబట్టి టెస్టులు పెంచుతాం.

17,081 బెడ్లలో 3500 బెడ్లకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది.. మొత్తం పది వేల బెడ్లకు ఆక్సిజన్ సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. వెయ్యి వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. గాంధీలో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్లు పది మంది మాత్రమే. ఎక్కడా బెడ్ల కొరత లేదు. శ్వాబ్ కలెక్షన్ సెంటర్లకు వచ్చి నమూనాలు ఇవ్వండి.



బాధ్యత లేని వ్యక్తులు రాసే రాతలను నమ్మొద్దు. ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను శంకించొద్దు. ఎన్ని వందల కోట్లు ఖర్చయినా చికిత్స అందిస్తాం. గాంధీ హాస్పిటల్ మినహా మిగతా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ముందుగా చికిత్స అందిస్తున్నాం. తర్వాత కరోనా పరీక్షలు చేస్తున్నాం. ప్రయివేట్ హాస్పిటళ్లలో 1000 బెడ్లకు మించి కరోనాకు కేటాయించలేరు. కానీ తెలంగాణలో గాంధీ, చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోఠి, టిమ్స్ లాంటి ప్రభుత్వ హాస్పిటళ్లు కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటళ్లుగా ఉన్నాయి. మా దగ్గర మందులు, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదు. ప్రభుత్వ హాస్పిటళ్ల కంటే ప్రయివేట్ హాస్పిటళ్లలో చికిత్స గొప్పగా అందించేదేం లేదు. ప్రయివేట్ హాస్పిటళ్లు బెడ్ల సంఖ్యను పెంచుకోలేవు.

గాంధీ హాస్పిటల్‌లో సౌకర్యాలు ఉన్నాయి. డిప్యూటీ సెక్రటరీ అరుణ్ కుమార్ గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ప్రజాప్రతినిధులకు చాలా కాలంగా ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు. కాబట్టి వాళ్లు ఫ్యామిలీ డాక్టర్లు ఉన్న కార్పొరేట్ హాస్పిటళ్లలో చేరుతున్నారు. అలాంటప్పుడు గాంధీ ఆసుపత్రిలో వచ్చి చేరమని చెప్పలేం కదా’’ అని ఈటల వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements