'2011 వరల్డ్‌కప్'...క్రిమినల్ ఇన్విస్టిగేషన్ మొదలు

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 04:51 PM

'2011 వరల్డ్‌కప్'...క్రిమినల్ ఇన్విస్టిగేషన్ మొదలు

భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై క్రిమినల్ ఇన్విస్టిగేషన్ మొదలైనట్లు శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ సెక్రటరీ కె.డి.ఎస్. రువాన్‌చంద్ర వెల్లడించాడు. ఆ ఫైనల్‌ని శ్రీలంక అమ్మేసిందంటూ ఇటీవల ఆ దేశ మాజీ క్రీడల మంత్రి మహిదానంద పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించగా.. సాక్షాలు ఉంటే బహిర్గతం చేయాలని శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్దనె డిమాండ్ చేశారు.

ఆ ఫైనల్‌‌లో ఫిక్సింగ్‌ జరిగిందంటూ ఆరోపించిన మహీందానంద.. క్రికెటర్ల ప్రమేయం మాత్రం లేదు.. కానీ.. కొంత మంది టీమ్‌కి చెందిన వారు అందులో భాగస్వామ్యులయ్యారు అని వెల్లడించాడు. దాంతో.. శ్రీలంక ప్రభుత్వం ఆ ఫిక్సింగ్‌పై విచారణ కోసం స్పెషల్ టీమ్‌ని నియమించింది. విచారణలో భాగంగా మహీందానంద‌‌ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసిన స్పెషల్ టీమ్.. ఫిక్సింగ్‌పై ఆధారాల్ని కోరగా.. తాను కేవలం అనుమానం మాత్రమే వ్యక్తం చేశానని అధికారులతో చెప్పినట్లు తెలిసింది.

మహీందానంద తప్పించుకునే ధోరణిలో వ్యవహరించినా.. శ్రీలంక ప్రభుత్వం మాత్రం ఆ ఫైనల్‌పై సీరియస్ ఇన్విస్టిగేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజాగా రువాన్ చంద్ర ఆ విచారణపై మాట్లాడుతూ ‘‘ఆ ఫైనల్‌పై క్రిమినల్ ఇన్విస్టిగేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ కేసుపై స్పెషల్ పోలీస్ టీమ్ పనిచేస్తోంది’’ అని వెల్లడించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ కూడా గతంలో ఆ ఫైనల్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేయగా.. ఆ దిశగా కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements