కాళేశ్వరంపై సీబీఐ విచారణ తప్పదు: రేవంత్

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 06:17 PM

కాళేశ్వరంపై సీబీఐ విచారణ తప్పదు: రేవంత్

కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులో నాణ్యతాలోపాలు రోజుకొకటి బయటపడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే, కేసీఆర్ ఫాంహౌస్‌కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉంటే ఇక రాష్ట్రంలో జరిగిన కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చిన్న కాలువల పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎత్తున నిర్మించిన 50 టీఎంసీల మల్లన్న సాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్, గందమల పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కేంద్రం, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని, ఇప్పటికే రెండు ప్రధాన కాలువలకు గండీలు పడ్డాయని గుర్తు చేశారు. 50 టీఎంసీల మల్లన్నసాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌, గందమల్ల ప్రాజెక్టులకు ఇలాగే గండిపడితే వాటి పరిధిలో ఒక్క ఊరు కూడా మిగలదని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

కేసీఆర్, మేఘా ఇంజినీరింగ్ కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపాలే నిదర్శనమని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని.. అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని రేవంత్ విమర్శించారు.





Untitled Document
Advertisements