షాకింగ్ వీడియో: కరోనా రోగుల మృతదేహాలను గుంతలో విసిరేస్తూ...

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 07:45 PM

షాకింగ్ వీడియో: కరోనా రోగుల మృతదేహాలను గుంతలో విసిరేస్తూ...

దేశంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ ఓ రకమైన భయం వెంటాడుతోంది. ఎవరైనా మరణించారని తెలిస్తే.. అటు వైపు అడుగేయడానికే జనం వణికిపోతున్నారు. అంత్యక్రియలకు ఆ నలుగురు కూడా దొరకని దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు మరణించినా అనుమానంగా చూసే దుస్థితి నెలకొంది. ఇక ఆ మరణించిన వారు కరోనా మహమ్మారి కారణంగానే పోయారని తెలిస్తే.. ఇక గుండెల్లో దడే.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. ప్రజల్లో నెలకొన్న భయాలను తరిమికొట్టాలని, కొవిడ్-19తో మరణించిన రోగుల అంత్యక్రియలు సంప్రదాయబద్దంగా జరగేలా చూడాలని కోర్టులు ఆదేశిస్తున్నాయి. అయినప్పటికీ.. అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కనీస మానవత్వం లేకుండా.. కరోనా రోగుల మృతదేహాలను గుంతలోకి విసిరేస్తున్న దారుణ దృశ్యాలు కర్ణాటకలోని బళ్లారిలో వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

కరోనా వైరస్‌తో మరణించిన రోగుల మృతదేహాలను మూటకట్టి ఒకదాని మీద మరొకటి వేసి అత్యంత దారుణంగా ఒకే గోతిలో (గుంత)లోకి విసిరేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. గోతిలోకి మృతదేహాలను విసిరివేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులో మైనింగ్ హబ్‌గా పేరు పొందిన బళ్లారి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బళ్లారి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సోమవారం (జూన్ 29) కరోనా కారణంగా ఈ జిల్లాలో 8 మంది మృతి చెందారు. ఈ రోగులకు సంబంధించిన మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా వైద్య సిబ్బంది సమూహికంగా ఖననం చేశారు. పెద్ద గుంతలు తీసి ఒకేచోట పూడ్చి పెట్టారు. ఒక్కో గుంతలో ఇద్దరేసి రోగుల మృతదేహాలను వేసి పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. మృతదేహాలను అమానవీయంగా గుంతలోకి విసిరేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



కొవిడ్-19తో మరణించిన రోగులను బళ్లారి నగర శివార్లలో ఒకేచోట అంత్యక్రియులు నిర్వహించడానికి ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చినట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు నిబంధనల ప్రకారం అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఒకే చోట అంత్యక్రియులు నిర్వహించాలని వైద్య శాఖ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇలా.. బళ్లారి నగర శివార్లలో ఎంపిక చేసిన ప్రాంతానికి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను తీసుకొచ్చి గుంతల్లో విసిరేసి మట్టితో కప్పేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్య సిబ్బంది, అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బళ్లారి జిల్లా కలెక్టర్ ఎస్ ఎస్ నకుల్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరోవైపు.. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కూడా బళ్లారి జిల్లాలో అనేక మంది వలస కూలీలుగా, నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బళ్లారి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాల నుంచి బళ్లారి జిల్లాలో అడుగుపెట్టే వారిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.






Untitled Document
Advertisements