నైవేలీలో లిగ్నైట్‌ బాయిలర్‌లో పేలుడు..ఆరుగురు మృతి

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 06:11 PM

నైవేలీలో లిగ్నైట్‌ బాయిలర్‌లో పేలుడు..ఆరుగురు మృతి

తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో బుధవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరులో ఉన్న నైవేలీ లిగ్నైట్ పవర్ ప్లాంట్ యూనిట్-2లోని బాయిలర్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎన్‌ఎల్సీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన బాయిలర్ వినియోగంలో లేదని అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని పేర్కొన్నారు.
ఈ ప్లాంట్ మొత్తం విద్యుతుత్పత్తి సామర్థ్యం 3,970 మెగాావాట్లు కాగా.. ప్రమాదం జరిగిన యూనిట్ 1,400 మెగావాట్లు. లాక్‌డౌన్ ఆంక్షలు తొలగించిన తర్వాత ఈ యూనిట్‌లో కార్యకలాపాల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో 27వేల మందికిపైగా ఉద్యోగులున్నారు.

ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మే నెలలోనూ ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. మే 8న జరిగిన ప్రమాదంలో ఎనిమిది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులు, ఆరుగురు ఒప్పంద కార్మికులు ఉన్నారు.

మే 7న విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీక్‌‌ ఘటన జరిగిన మర్నాడే నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో పేలుడు సంభవించింది. తాజాగా, జూన్ 30న విశాఖపట్నంలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకయి మరుసటి రోజే యాాదృశ్చికంగా నైవేలీలో మరో ప్రమాదం జరగడం గమనార్హం.





Untitled Document
Advertisements