హైదరాబాద్‌లో లాక్‌డౌన్: వెనక్కి తగ్గుతున్న సర్కార్!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 10:13 AM

హైదరాబాద్‌లో లాక్‌డౌన్: వెనక్కి తగ్గుతున్న సర్కార్!

హైదరాబాద్‌‌లో లాక్‌డౌన్ విధించే విషయంలో తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్-2 మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతటా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రమే లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని పేర్కొంది.
వాస్తవానికి జూలైన 2 కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించే విషయమై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఇటీవలే సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరగడంతో నగరవాసులు అప్రమత్తమయ్యారు. చాలా మంది ముందు జాగ్రత్తగా ఇంట్లోకి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. నగరంలో కేసులు పెరుగుతుండటం.. లాక్‌డౌన్ ప్రచారంతో చాలా మంది తమ సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కానీ లాక్‌డౌన్ విధించే విషయమై ప్రభుత్వం ఆలోచన మారడానికి చాలా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. లాక్‌డౌన్ విధిస్తే.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. పోలీసులపైనా పని ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా కరోనా కట్టడికి లాక్‌డౌన్ మాత్రమే ప్రత్యామ్నాయం కాదనే భావన వ్యక్తం అవుతోంది.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని చాలా మార్కెట్లను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. లాడ్ బజార్, బేగం బజార్, సికింద్రాబాద్‌లోని బనారస్ చీరల మార్కెట్‌ను వ్యాపారులు మూసివేశారు. చాలా చోట్ల తక్కువ సమయమే దుకాణాలను తెరచి ఉంచుతున్నారు. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ అవసరం లేదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందేమోననే భావన వ్యక్తం అవుతోంది.



ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా, విధించకపోయినా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరవాసులు మాత్రం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది.





Untitled Document
Advertisements