వైష్ణవ్‌ తేజ్ ‘ఉప్పెన’...థియేటర్లోనే !

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 02:11 PM

వైష్ణవ్‌ తేజ్  ‘ఉప్పెన’...థియేటర్లోనే !

మెగా కాంపౌండ్‌ నుంచి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న మరో హీరో పంజా వైష్ణవ్‌ తేజ్. సాయి ధరమ్‌ తేజ్‌కు అతను సొంత తమ్ముడు. అతను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్. బుచ్చిబాబు సాన దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ స్టార్ ఓ కీలక రోల్‌ పోషిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ ‘నీకల్లు నీలి సముద్రం’ సూపర్ హిట్టయింది. మార్చి 1వ తేదీన విడుదలైన ఈ సాంగ్‌ ఇప్పటికీ ట్రెండ్‌ అవుతోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే 80 మిలియన్ల పైచిలుకు వ్యూస్‌ వచ్చాయి. వైష్ణవ్‌, కృతి లుక్‌ కూడా బాగుండడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.

అంతా బాగానే ఉన్నా ఈ మూవీ రిలీజ్‌ విషయంలోనే చిత్రబృందం ముందడుగు వేయలేకపోతోందట. కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడడం.. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియకపోవడడంతో టాలీవుడ్ సినిమాలు ఓటీటీల బాట పట్టాయి. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ సైతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ‘ భానుమతి అండ్ రామకృష్ణ’, ‘47 డేస్’ తదితర సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ కూడా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ మూవీని థియేటర్ లో మాత్రమే విడుదల చేయాలని చిత్ర బృందం తుది నిర్ణయానికి వచ్చిందట. కొత్త నటులతో చేసినప్పటికీ ఈ మూవీకి దాదాపు 20 కోట్లు ఖర్చు చేశారు. పైగా మెగా కాంపౌండ్‌ నుంచి అరంగేట్రం చేస్తున్న హీరో వైష్ణవ్‌కు తగిన గుర్తింపు రావాలంటే థియేటర్ అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట. అందువల్ల థియేటర్ల ఓపెనింగ్‌పై స్పష్టత వచ్చేదాకా వేచి చూడడమే ఉత్తమమని చిత్ర యూనిట్‌ నిర్ణయానికి వచ్చిందట. ఈ లెక్కన మెగా హీరో థియేటర్లోనే ఉప్పెన సృష్టిస్తాడన్నమాట.





Untitled Document
Advertisements