న్యూఢిల్లీ, నవంబర్ 25: బ్యాంక్ ఉద్యోగ సంఘాలు వచ్చే నెల 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ ఐడిబిఐ బ్యాంక్లో దీర్ఘకాలంగా వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబిఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎఐబిఔ) పిలుపునిచ్చిన ఈ సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కూడా మద్దతు తెలిపింది. ఐడిబిఐ బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు వేతనాలు సవరించాలని కొన్నేళ్ల నుంచి ఎఐబిఈ కోరుతూ వస్తుంది. వీరి వేతన పెంపు 2012 నవంబరు 1 నుంచి వాయిదాపడింది.
ఇదిలా ఉండగా మొండిబకాయిల వలన నష్టాల్లో ఉన్నపిఎస్బి విలీనంపై కెనరా బ్యాంక్ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాంటి బ్యాంకులను విలీనం చేయడం వల్ల బ్యాంకులకు ఊరట లభించకపోగా, పెద్ద బ్యాంక్లపై మరింత ఒత్తిడి పెరుగుతుందని కెనరా బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు ఎస్ రెవన్నావ్యాఖ్యానించారు.