ఏపీ వెళ్లేవారికి అలెర్ట్...ఆ ప్రచారాలు నమ్మొద్దు!!

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 01:17 PM

ఏపీ వెళ్లేవారికి అలెర్ట్...ఆ ప్రచారాలు నమ్మొద్దు!!

దేశవ్యాప్తంగా అన్‌లాక్ 3.O అమల్లోకి వచ్చింది. అన్‌లాక్‌ 2.0 ముగయడంతో.. ఆగస్టు 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలిగించింది. అలాగే మరికొన్ని నిబంధనల్ని కూడా సడలించింది. రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. కొన్ని నిర్ణయాలు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించారు.

అన్‌లాక్ 3.O అమల్లోకి రావడంతో ఏపీకి రావాలంటే పాస్ అవసరం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ జగన్ సర్కార్ మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ఎవరైనా ఏపీలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ-పాస్ ఉండాలని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏపీకి వచ్చే వారు తప్పనిసరిగా స్పందనలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఆంక్షలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయంటున్నారు.

పాస్ తీసుకుని ఇతర రాష్ట్రాల నుండి ఏపీలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏపీలోకి అనుమతిస్తారు. ఈ- పాస్ ఉన్న వాహనదారుల దగ్గర నుంచి ఆధార్ నెంబర్, చిరునామాను నమోదు చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తారు.. అనుమానం ఉన్నవారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి. పాస్ ఉన్నా సరే ఉదయం ఏడు గంటల తర్వాత మాత్రమే ఏపీలోకి అనుమతిస్తారు.. రాత్రి ఏడు తర్వాత సరిహద్దులో అనుమతించరు. కేవలం అత్యసవరమైన వారికి మాత్రం సడలింపులు ఇచ్చారు.





Untitled Document
Advertisements