తెలంగాణలో ఈ నెల 5 నుంచి జిమ్‌లు ఓపెన్?!

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 05:58 PM

తెలంగాణలో ఈ నెల 5 నుంచి జిమ్‌లు ఓపెన్?!

కరోనా కారణంగా క్రీడా రంగం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ప్రక‌టించనున్న కొత్త క్రీడా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని, స్పోర్ట్స్ పాలసీపై తమ సలహాలు, సూచనలు ఇవ్వడానికి సీనియర్ ఆటగాళ్లు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని పలువురు క్రీడాకారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. నూతన క్రీడా విధానం రూపకల్పనకు వారి నుంచి మంత్రి సలహాలు, సూచనలు తీసుకున్నారు.

ఈ నెల 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన వాటి యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. తక్కువ మందితోనే వ్యాయామశాలలు, యోగా కేంద్రాలు నడిపించాలని సూచించారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 5 నుంచి మైదానాలు, స్టేడియాల్లో క్రీడాకారులు సాధనలు ప్రారంభించవచ్చని అన్నారు. అయితే, స్టేడియాల్లో టోర్నమెంట్ల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

సమావేశంలో మాజీ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ అజహరుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బ్యాడ్మింటన్ స్టార్స్ సిక్కిరెడ్డి, సాయి ప్రణీత్, సుమిత్ రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎమ్.డి. శ్రీనివాస్ రాజు, చాముందేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు. రవీంద్రభారతిలోని క్రీడాశాఖ మంత్రి ఛాంబర్‌లో ఈ సమావేశం జరిగింది.





Untitled Document
Advertisements