ప్రభుత్వం కీలక నిర్ణయం: కరోనా పేషంట్లకు ఫ్రీగా పల్స్ ఆక్సీమీటర్లు!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 12:58 PM

ప్రభుత్వం కీలక నిర్ణయం: కరోనా పేషంట్లకు ఫ్రీగా పల్స్ ఆక్సీమీటర్లు!

కొవిడ్-19 బాధితులకు గొప్ప ఊరట కల్పిస్తూ అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి బారినపడి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషంట్లకు ఉచితంగా చికిత్స అందించడంతో పాటు పల్స్ ఆక్సీమీటర్లను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం (ఆగస్టు 9) ఈ విషయాన్ని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలకు గేట్ వే‌గా పేర్కొనే గౌహతి నగరంలో ఇప్పటికే టెలి మెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు.

కరోనా మహమ్మారి ప్రధానంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. రక్తంలో ఆక్సీజన్ స్థాయిలు తగ్గితే బాధితులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ కారణంగా ఇప్పటికే అనేక మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో పల్స్ ఆక్సీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆక్సీజన్ స్థాయిలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీలో పల్స్ ఆక్సీజన్ మీటర్లను ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత గత నెలలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషంట్లలో ఏ ఒక్కరూ మరణించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే తెలిపారు.

అనేక రాష్ట్రాల్లో కరోనా రోగులకు హాస్పత్రుల్లో పడకలు దొరకట్లేదు. పడకలు దొరికినా ఆరోగ్య పరిస్థితి విషమిస్తే ఆక్సీజన్ అందించడానికి వెంటిలేటర్ వసతి ఉన్న పడకల కొరత ఉంది. ప్రైవేట్ హాస్పత్రులు బిల్లుల మోత మోగిస్తుండటంతో చేసేదేంలేక చాలా మంది ఇంటి వద్దే ఉండి కొన్ని చిట్కాలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు. అలాంటి వారికి అసోం ప్రభుత్వ నిర్ణయం కొండంత బలాన్ని ఇవ్వనుంది.


‘ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్న పేషంట్లకు రేపటి నుంచి (సోమవారం) ఉచితంగా పల్స్ ఆక్సీమీటర్లను అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు చికిత్సకు అవసరమైన కొన్ని మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తాం. దీంతో పాటు 104 సేవలతో అందిస్తున్న టెలిమెడిసిన్ సదుపాయాన్ని మరిన్ని నగరాల్లోనూ అందిస్తాం’ అని అసోం ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.

హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో అసోం ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఢిల్లీ ప్రభుత్వ దారిలో అసోం ప్రభుత్వం కూడా ప్లాస్మా దానం గురించి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.

అసోంలో ఇప్పటివరకు 57 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 140 మంది మరణించారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 17 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అసోంలో గత శుక్రవారం రికార్డు స్థాయిలో 2679 కేసులు నమోదయ్యాయి. శనివారం 2218 కేసులు నమోదయ్యాయి.





Untitled Document
Advertisements